వుహాన్ నుంచే కరోనా...? వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం..
posted on May 24, 2021 @ 4:05PM
ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బాలి తీసుకున్న, కరోనా, ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? అనేది ఇంతవరాకు ఒక మిస్టరీగానే వుంది. అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలు మొదటి నుంచి కూడా, జీవాయుధాల పరిశోధనలు జరుగుతున్న చైనాలోని వుహాన్’ ల్యాబ్ నుంచే, కరోనా వైరస్ లీక్ అయిందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుండు డోనాల్డ్ ట్రంప, అయితే కరోనాను చైనా మహమ్మారి, వుహాన్ వైరస్ అని పేర్కొన్నారు. చైనానే ఈ వైరస్ ను సృష్టించిందనే అనుమానాల బలంగా వ్యక్త పరిచారు.
తాజాగా,ఆ అనుమానాలను బలపరిచే ఆధారాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇందుకు సంబంధించి కొన్ని సంచలన నిజాలను బయట పెట్టింది. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం, కరోనా అనే పదం ప్రపంచం చెవిన పడడానికి కొన్నినెలల ముందే.. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు పరిశోధకులు 2019 నవంబరులో ఆసుపత్రిలో చేరారని పేర్కొంది. ఇందుకు ఆధారంగా అమెరికా నిఘా వర్గాలు వెల్లడించిన నివేదికను ఉటంకించింది.కరోనా వైరస్ సోకిన పరిశోధకుల వివరాలు, చికిత్స పొందిన ఆసుపత్రుల వివరాలను కూడా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. అంతే కాకుండా, ఇప్పటికైనా కరోనా వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా లేదా అనే దానిపై విస్తృత దర్యాప్తు జరగాలని కోరింది. కరోనా మూలాలపై తదుపరి దశ దర్యాప్తునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయాత్మక విభాగం త్వరలోనే సమావేశం కానున్న సమయంలో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఈ నివేదిక బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుదని అంటున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఎమిలీ హార్న్ స్పందించడానికి నిరాకరించారు. కానీ, తొలినాళ్లలో కొవిడ్ పుట్టుక, చైనాలో దాని మూలాల గురించి బైడెన్ యంత్రాంగం నిరంతరం సీరియస్గా పరిశీలిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. కొవిడ్ మూలాలపై దర్యాప్తు విషయంలో రాజకీయాలు చేయకుండా డబ్ల్యూహెచ్ఓ, ఇతర దేశాల నిపుణులతో కలిసి అమెరికా ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు.అదే సమయంలో కరోనా పుట్టుకకు సంబంధించి బయటకు వస్తున్న విషయాలపై సాంకేతికంగా విశ్వసనీయమైన సిద్ధాంతాలను అంతర్జాతీయ నిపుణులు పూర్తిగా అంచనా వేయాలని మేము స్పష్టంగా చెప్పాం, అని ఎమిలీ వ్యాఖ్యానించారు.
ల్యాబ్ పరిశోధకుల గురించి ఇంటెలిజెన్స్ ప్రస్తుత, మాజీ అధికారులు... నివేదికలో సాక్ష్యాల బలం గురించి పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారని, పేరు వెల్లడించని మరో అధికారి.. మరింత దర్యాప్తు, అదనపు ధృవీకరణ అవసరమని చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలో కోవిడ్ మూలాల దర్యాప్తుపై అమెరికా, నార్వే, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు మార్చిలో ఆందోళన వ్యక్తం చేశాయి. అంతేకాదు, తదుపరి దశ దర్యాప్తులో మహమ్మారి పుట్టుక, వ్యాప్తి గురించి పూర్తిస్థాయి సమాచారం సేకరించాలని డిమాండ్ చేశాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దర్యాప్తు గురించి చైనా సహకారం, పారదర్శకతను నిర్ధారించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం తక్షణమే దీనిపై స్పందించడానికి నిరాకరించింది. ఫిబ్రవరిలో వైరాలజీ ఇనిస్టిట్యూట్ను సందర్శించిన తరువాత డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని బృందం ల్యాబ్ నుంచి లీక్ అవడం చాలా అరుదు అని చెప్పిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ఆదివారం గుర్తు చేసింది. ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని అమెరికా హైప్ చేస్తూనే ఉందని చైనా మండిపడింది.