విజయసాయి తిరుపతి మొక్కు ఏమై ఉండొచ్చు?

విజ‌య‌సాయిరెడ్డి మొహం చూస్తుంటే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న‌ట్టుంది. ఒక ద‌రిద్రం వ‌దిలింద‌న్న సంబ‌రంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అనేక విచార‌ణ‌ల‌కు వెళ్లి వ‌స్తున్నా.. ఆయ‌న మోములో తొణికిస‌లాడుతున్న‌ ఆ ఆనందానికి గ‌ల కారణాలేంట‌ని చూస్తే.. సాయిరెడ్డిగానీ ఇప్ప‌టికీ వైసీపీలో ఉండి ఉంటే ఆ టెన్ష‌న్ వేరే లెవ‌ల్లో ఉండేది. కానీ త‌న‌లోని చార్టెడ్ అకౌంటెంట్ తెలివి తేట‌ల‌న్నిటినీ వాడి.. వైసీపీకి రాం రాం చెప్పేసి.. చేతులు దులుపుకున్నారు. 

ఇటు వైసీపీ స‌భ్య‌త్వానికి, అటు త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన సాయిరెడ్డి అప్పుడే ప‌దే ప‌దే వెంక‌టేశ్వ‌ర స్వామివారిని తలుచుకున్నారు. అలాంటి స్వామివారి చెంత‌కు ఇప్పుడు వ‌చ్చాక ఆయ‌న ఎలాంటి మొక్కులు మొక్కుకుని ఉంటార‌న్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పైకి ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. విచారణలను ఎదుర్కొంటున్నారు.   మ‌ద్యం విచార‌ణ‌ల‌కు హాజ‌రవుతున్నారు. రాజ్ కేసిరెడ్డిని తెలివైన క్రిమిన‌ల్ అని ఈయ‌న అన‌డం, సాయిరెడ్డిని రాజ్ కేసిరెడ్డి కూడా విజయసాయిరెడ్డిని తిట్ట‌డం మ‌నకు తెలిసిందే.

 ఈ క్ర‌మంలో రాజ్ కేసిరెడ్డి త‌దిత‌రులు వ్యాపారం చేస్కోడానికి అప్పులు ఇప్పించాన‌ని కూడా చెప్పారు విజ‌యసాయిరెడ్డి. ఇలాంటి వాటితో పాటు కాకినాడ పోర్టు వ్య‌వ‌హారాలు ఇంకా ఎన్నో స‌మ‌స్య‌ల్లో పీక‌లోతు కూరుకుపోయిన విజ‌య‌సాయి.. ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికీ కార‌ణ‌మైన పార్టీని వ‌దిలినా.. అప్ప‌ట్లో ఆయ‌న చేసిన పాపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వీటి నుంచి విముక్తి క‌లిగించ‌మ‌ని మొక్కి ఉంటారా?

 మొన్న‌టికి మొన్న భీమిలి బీచ్ లో విజ‌య‌సాయిరెడ్డి  సెవెన్ స్టార్ సామ్రాజ్యాన్ని సైతం పునాదుల‌తో స‌హా  పెక‌ళించింది  కూట‌మి ప్ర‌భుత్వం. దీన్నిబ‌ట్టీ చూస్తే సాయి రెడ్డి కూసాలు ఏ స్థాయిలో కదులుతున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. అంటే బిడ్డ చ‌చ్చినా పురిటి కంపు పోవ‌డం లేద‌న్న చందంగా త‌యారైంద‌న్న‌మాట‌ విజ‌య‌సాయి జాత‌కం. ఈ విష‌యంలో స్వామివారిని ఏదైనా కోరి ఉంటారా? ఒక ర‌కంగా చెబితే పార్టీలో ఉండి  కేసులు ఎదుర్కుంటున్న వారు హ్యాపీగానే ఉన్నారు. వారికంటూ ఒక సింప‌తి వ‌చ్చే ప‌రిస్థితి కూడా ఉంది. అదే విజ‌య‌సాయి రెడ్డికి ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ‌గా ఉంది. ఈ విష‌యంలో కాస్తా  త‌న‌ను బ‌య‌ట ప‌డేయ‌మ‌ని కూడా ఆయ‌న కోరుకుని ఉండొచ్చ‌ని అంటారు కొంద‌రు.

 వైసీపీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ పార్టీలో నెంబ‌ర్ 2 గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి.. అధికారంలోకి వ‌చ్చాక 2వేల స్థానానికి ప‌డిపోవ‌డానికి కార‌కుల‌ను కూడా ఒక ప‌ట్టు ప‌ట్ట‌మ‌ని శ్రీవారిని వేడుకునే అకవ‌కాశాలు కూడా లేక పోలేదు. అంతే కాదు వీట‌న్నిటి నుంచి తాను బ‌య‌ట ప‌డ్డానికి ఒక మంచి పార్టీని చూపించ‌మ‌ని.. ఈ క‌ష్టాల క‌డ‌గండ్ల నుంచి త‌న‌ను త‌ప్పించ‌మ‌ని కూడా స్వామివారిని, సాయి రెడ్డి కోరుకునే అవ‌కాశాలు కూడా ఉండొచ్చంటారు కొంద‌రు. వీట‌న్నిటినీ అటుంచితే.. విజ‌య‌సాయి రెడ్డి తానొక మీడియా సంస్థ పెడ‌తాన‌ని కూడా గ‌తంలో అన్నారు. ఈ విష‌యంలో ఏదైనా మంచి పేరు త‌ట్టేలా చేయ‌మ‌ని కూడా స్వామివారిని కోరుకుని ఉండొచ్చు. 

ఇక పోతే తాను త‌న శేష జీవితాన్ని వ్య‌వ‌సాయం చేసుకుని గ‌డుపుతాన‌ని కూడా ఆయ‌న‌ గ‌తంలో అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అందుకు త‌గిన సాయం.. చేయ‌మ‌ని కూడా తిరుమ‌ల వెంక‌న్న‌ను సాయిరెడ్డి కోరుకుని ఉండొచ్చంటారా? కొంద‌రు అంటున్న మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే విజ‌య‌సాయి పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఒక‌ర‌క‌మైన మెలో డ్రామాకు తెర‌లేపార‌నీ.. ఆ డ్రామా బ‌య‌ట ప‌డ‌కుండా చూడ‌మంటూ స్వామివారిని కోరి ఉండొచ్చ‌ని కూడా అంటున్నారు మ‌రి కొంద‌రు. 

మ‌రి చూడాలి.. త‌న‌క‌న్నా మించిన వ‌డ్డీ లెక్క‌ల్ని క‌ట్టే ఒక భ‌క్తుడు ఎదురైన‌పుడు ఎంతైనా శ్రీవారికి కూడా కాస్త టెన్ష‌న్ గానే ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నో లెక్క‌లు ఉన్న‌వి లేనివి- లేనివి ఉన్న‌వీ చూపించి సూట్ కేస్ కంపెనీలు పెట్టించి, పుట్టించి.. ఒక స‌మ‌యంలో త‌న మాజీ అధినేత జ‌గ‌న్ తో క‌ల‌సి ఏ2గా జైల్లో ఉండొచ్చినోడు.. అలాంటి మాయావి  ఎదురు ప‌డి.. త‌న స‌మ‌స్య‌ల‌ చిట్టా మొత్తం విప్పి.. వీట‌న్నిటినీ తీర్చాల్సిందే.. అని కోరుకుని పనిలో పనిగా క్విడ్  స్వామివారికి బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించి  ఉండొచ్చు.

 ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను శ్రీవారు అనుమ‌తిస్తారా లేదా అన్నది వేరే విషయం. ఏది ఏమైనా సాయిరెడ్డి శ్రీవారి ద‌ర్శ‌నానికి రావ‌డం మాత్ర‌మే కాకుండా.. నిండా గుండు కొట్టుకుని న‌యా అవ‌తార్ లో క‌నిపించారు సాయిరెడ్డి. ఆయ‌న‌ త‌ర్వాతి అవ‌తారం ఎప్పుడు- ఎక్క‌డ‌- ఎలా ఉండ‌బోతుంద‌న్న‌దానిపై కూడా  క్లారిటీ రావ‌ల్సి ఉంది. చూద్దాం.. విజ‌య‌సాయి రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండ‌బోతుందో.. ఈ విష‌యంలో ఆయ‌న స్వామివార్ని ఎలాంటి కోరిక‌లు కోరి ఉంటారో.. తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే. ఏమంటారు?