ఏమి జరుగుతోంది? ఎందుకీ మౌనం?
posted on May 4, 2025 @ 12:32PM
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన అణ్వాయుధాలే ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే కాదు, ఆయుధ సంపత్తితో సహా సైనిక సామర్థ్యం, ససిద్ధత విషయంలో భారత దేశం పాక్ కు అందనంత ఎత్తులో వుంది. పాక్ వద్ద అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి కావచ్చు. కానీ భారత అంబుల పొదిలో అణ్వాయుధాలను మైళ్ళ దూరంలోనే నిర్వీర్యం చేసే పటిష్ట మైన జీపీఎస్ జామర్ వ్యవస్థ ఉందని యుద్ద రంగ నిపుణులు చెపుతున్నారు. నిజానికి యుద్ధం అంటూ వస్తే పాకిస్థాన్ ఎప్పటికే కోలుకోలేనంత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రపంచ దేశాల యుద్దరంగ నిపుణులు పాక్ ను హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఈ నిజం ప్రపంచ దేశాల కంటే ఎక్కువగా పాకిస్థాన్ కే తెలుసు. ఆ దేశానికి తమ బలమెంతో, బలహీనత ఏమిటో బాగా తెలుసు.
అయితే.. భారత దేశం ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తోంది? ఎందుకు, యుద్ధానికి పచ్చ జెండా ఉపడం లేదనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నుంచి, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి అనుమనాలు ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి. తాజాగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పహల్గాం ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు విపక్షాలు కేంద్రంతో ఉన్నాయని స్పష్టం చేసినప్పటికీ ఇంతవరకూ కేంద్ర వద్ద నిర్దిష్టమైన వ్యూహం ఏమీ కనిపించడం లేదని, అన్నారు. శుక్రవారం (మే 2) జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. మరో వంక ప్రభుత్వం తమను విశ్వాసంలోకి తీసుకుని, అన్ని విషయాలు చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ఈమేరకు డిమాండ్ చేస్తే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పహల్గాం ఉగ్రదాడి పై చర్చినేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ వ్యూహం ఏమిటో కానీ.. ఏ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. అలాగని, ఏమీ జరగడం లేదా అంటే.. ఏదో జరుగుతోందన్నది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు.
మరో వంక జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి వదిలేయాలని అంటున్నారు. ప్రభుత్వం వెలుపల ఉన్న ఎవరైనా ఒకటి రెండు కోణాలలో మాత్రమే చూడగలం, ప్రభుత్వం సమస్యను సమగ్రంగా అన్ని కోణాల్లో చూడగలుగుతుంది. అలాగే పర్యవసానాలు ఎలా ఉంటాయి.. లాభ నష్టాలూ ఏమిటి? ప్రపంచ దేశాల స్పందన ఏమిటి? అన్న విషయాలన్నిటికీ సమగ్రంగా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. నిజానికి, ప్రస్తుత సంక్లిష్ట సమయంలో రోజు వారీ నివేదికలు కోరటం ప్రతిపక్షాలకు తగదని విశ్లేషకులు సైతం అంటున్నారు.