కేబినెట్ స్పెల్లింగ్ తెలీదు కానీ సీఎం అభ్యర్థి అట.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
posted on Oct 31, 2020 @ 5:59PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి(మహాఘటబంధన్) సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పై తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వికి అసలు "కేబినెట్" అనే పదం పలకడం కూడా సరిగా రాదని అయన ఎద్దేవా చేశారు. కనీసం 10వ తరగతి కూడా చదవని తేజస్వి యాదవ్.. ఇంజినీరింగ్ చదివిన సీఎం నితీశ్ కుమార్ ను విమర్శిస్తున్నారని అయన మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య గురించి కూడా తేజస్వికి ఒక స్పష్టమైన అవగాహన లేదని అయన విమర్శించారు. అసలు కేబినెట్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తేజస్వి రాయలేడని అయన ఎద్దేవా చేశారు.
తేజస్వి తండ్రి ఒకప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తన తొలి కేబినెట్ సమావేశంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని... దీనికోసం ప్రజల దగ్గర నుండి డబ్బులు కూడా వసూలు చేశారని... అయితే, అప్పటి ఆ అప్లికేషన్లన్నీ ఇప్పటికీ డస్ట్ బిన్ లోనే ఉన్నాయని అశ్వినీ చౌబే తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాకుండా... జేడీయూ, కాంగ్రెస్ కూటమిని "గప్పు - పప్పు" అని ఎద్దేవా చేశారు. ఈ గప్పు-పప్పుల కూటమి ప్రజలకు నెరవేర్చలేని తప్పుడు హామీలను ఇస్తుందని, ప్రజలు ఈ నాయకుల పట్ల చాల జాగ్రత్తగా ఉండాలని అయన అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన వసతులను కల్పించినప్పుడే దాన్ని మంచి పాలన అంటారని... లేకపోతే అది దోపిడీ ప్రభుత్వం అవుతుందని అయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన మొదటి విడత పోలింగ్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో జెడియూ, బీజేపీ కూటమి తేజస్వి యాదవ్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఎలాగైనా మిగిలిన విడతల ఎన్నికలలో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీలు ఈ విధంగా తమ ప్రత్యర్థిని టార్గెట్ చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.