తెలుగు లోగిళ్ళలో ఉగాది శోభ
posted on Apr 4, 2011 @ 10:08AM
హైదరాబాద్: తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని తెలుగుప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. శ్రీ ఖర నామసంవత్సరం ప్రారంభ సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పంచాంగశ్రవణాలు నిర్వహించారు. తెలుగు లోగిళ్ళు మామిడాకుల తోరణాలతో పండగ శోభను సంతరించుకున్నాయి.
కాగా, ఉగాది పండుగ రోజున శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ అనంతరం భగవంతుడిని పూజించాలి. పూజానంతరం పెద్దల ఆశీస్సులను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజున వుంటే ఆ రోజున ఉగాది పండుగ పరిగణిస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున శ్రీరామునిని ఆరాధించడంతో పాటు శక్తి ఆరాధనకు కూడా విశిష్టమని పురోహితులు చెబుతున్నారు.