12 ఏళ్ల లోపు చిన్నారులకు ఫ్రీ! త్వరలో ఆర్టీసీ బంపర్ ఆఫర్..
posted on Jan 1, 2022 @ 7:47PM
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆర్టీసీ సంస్థలు నష్టాల్లో పని చేస్తున్నాయి. లాభాల పట్టేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే నూతన సంవత్సరంలో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా తెలంగాణ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతోంది. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని జనవరి 1 నాడు 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర అంశం వెల్లడించారు. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ బస్ భవన్ లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో పాటు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారులకు శాశ్వత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కుతారని వివరించారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ ఆక్యుపెన్సీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీ అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ చేసే అవకాశం కల్పించాలని దాదాపుగా నిర్ణయం జరిగిపోయిందని, రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన వస్తుందని చెబుతున్నారు.