ఓటేసిన సీఎం, మాజీ సీఎం.. కొడంగల్ లో రేవంత్, చింతమడకలో కేసీఆర్
posted on May 13, 2024 @ 12:22PM
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటేశారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో కేసీఆర్, శోభమ్మ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి సురేఖ, కూతురు సుస్మితలతో కలిసి ఓటేసేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఓటు విలువ తెలియజేస్తూ మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత అని చెప్పారు. మన రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో వెళ్ళడానికి మీ ఓటు ఉపయోగపడుతుంది. మీ ఓటు పవర్ చూపించండి. అందరూ ఖచ్చితంగా మీ హక్కును వినియోగించుకోండి అని పిలుపునిచ్చారు.