గులాబీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్?
posted on Aug 25, 2020 @ 4:20PM
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసనమండలి ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. హైద్రాబాద్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కారు పార్టీ దూకుడుగా ఉండేది. అయితే తొలిసారి ఆ పార్టీలో ఎన్నికల టెన్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉండగా.. నల్గొండ నుంచి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు ఉండగా.. నల్గొండ స్థానం పరిధిలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలున్నాయి. ఓటు హక్కు ఉన్నవారంతా విద్యాధికులు కావడంతో... వారంతా ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న సస్పెన్ష్ అధికార పార్టీలో ఉంది. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు చాలా గుర్రుగా ఉన్నారు. మూడేళ్ల కిందట ఇస్తామన్న పీఆర్సీ ఇంకా ఇవ్వకపోవడం.. ప్రశ్నించే ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేయడం వంటి ఘటనలపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. బదిలీలు, ప్రమోషన్ల విషయాన్ని సర్కార్ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు పెరిగాయని ఆరోపిస్తున్న ఉద్యోగులు.. తమను బెదిరించేలా సర్కార్ వ్యవహరిస్తోందనే భావనలో ఉన్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరును ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. తహశీల్దార్లు, రెవిన్యూ సిబ్బందిపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్న నిరుద్యోగులు... ఇప్పటికే చాలా సార్లు ఆందోళన చేశారు. కేసీఆర్ పై గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో విద్యార్థుల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది.
కరోనా కట్టడి, వరదలు, పంట నష్టం విషయాల్లోనూ ప్రభుత్వ తీరు సరిగా లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న వేళ కేసీఆర్.. ప్రజలను గాలికోదిలేశారనే వాదన ఉంది. కరోనాతో ప్రజలు చనిపోతున్నా ముఖ్యమంత్రి స్పందించలేదని, ప్రగతి భవన్, ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించాయి. జనాలు కూడా కరోనా కట్టడిలో సర్కార్ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వరదలు వచ్చినా.. క్షేత్రస్థాయి అధికారులు సరిగా స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి వ్యతిరేకత కనిపిస్తుండటంతో గులాబీ పార్టీలో మండలి ఎన్నిక గుబులు రేపుతోంది.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలను విపక్షాలు సవాల్ గా తీసుకుంటున్నాయి. టీజేఎస్ ఛైర్మెన్ కోదండరామ్ నల్గొండ నుంచి పోటీ చేసే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కోదండరామ్ కు ఉద్యోగులు, నిరుద్యోగులు మద్దతు ఇవ్వొచ్చని వారు భయపడుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో కోదండరామ్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కోదండరామ్ గెలిస్తే కేసీఆర్ కు ఇబ్బందులే. హైద్రాబాద్ స్థానంలో బీజేపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఉద్యోగ సంఘం నేత దేవిప్రసాద్ ను బరిలోకి దింపినా టీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఇప్పుడు ఉద్యోగులంతా సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నందున.. ఈసారి గెలవడం దాదాపు అసాధ్యమనే చర్చ అంతర్గతంగా టీఆర్ఎస్ లో జరుగుతోంది. హైద్రాబాద్ పై ఎలాగు ఆశలు లేవు.. నల్గొండలో కూడా ఓడిపోతే పార్టీ పరువు పోతుందని మరికొందరు నేతలు భయపడుతున్నారు. పోటీ చేసి ఇబ్పందులు పడేకంటే.. పోటీ చేయకుండా ఎవరికైనా తటస్థులకు లోపాయకారిగా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా టీఆర్ఎస్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కారు పార్టీకి సవాల్ గా నిలువబోతున్నాయి. మరీ కేసీఆర్ ఎలా ముందుకు వెళతారో చూడాలి.