గ్రేటర్ పీఠం మళ్లీ గులాబీదే! ఎగ్జిట్ పోల్స్ లో కారు హవా
posted on Dec 4, 2020 8:54AM
గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్పోల్స్లో అధికారి పార్టీదే హవా. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నా.. టీఆర్ఎస్ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనకబడే ఛాన్స్ ఉంది. పాతబస్తిలో పట్టు నిలుపుకుని మజ్లిస్ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుందని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.
‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే లో టీఆర్ఎస్కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైలెంట్ వేవ్ కన్పిస్తోందని..ఈ వేవ్ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశం ఉందని ‘పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
టీఆర్ఎస్కు 71 నుంచి 85 వరకు సీట్లు వస్తాయని ఆరా సర్వేలో వచ్చింది. ఆరా అంచనా ప్రకారం బీజేపీకి 23 నుంచి 33 సీట్లు రానున్నాయి. ఎంఐఎంకు 36 నుంచి 46, కాంగ్రెస్ కు సున్నా నుంచి 4 సీట్లు వస్తాయని ఆరా సర్వే తెలిపింది. సీపీఎస్సర్వేలో టీఆర్ఎస్కు 82 నుంచి 96 సీట్లు రానుండగా.. బీజేపీకి 12-20 సీట్లు, ఎంఐఎంకు 32 నుంచి 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఏకంగా 95 నుంచి 101 డివిజన్లులో కారు గెలుస్తుందని నాగన్న సర్వే వెల్లడించింది. నాగన్న సర్వేలో బీజేపీకి 5 నుంచి 12, ఎంఐఎంకు 35 నుంచి 38 డివిజన్లు రానున్నాయని తెలిపింది. ఎన్ఎఫ్వో సంస్థ టీఆర్ఎస్ 85-95, బీజేపీ 15-25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆత్మసాక్షి సర్వేలో టీఆర్ఎస్కు భారీ సీట్లు 82 నుంచి 88 సీట్లు వస్తాయని తేలింది.
గ్రేటర్ ఎన్నికలపై ఇప్పటివరకు వెల్లడైన అన్ని సర్వేల్లోనూ టాప్గా కనిపిస్తోంది టీఆర్ఎస్. అధికార పార్టీకి కనిష్టంగా 68, గరిష్టంగా 101 సీట్లు వచ్చాయి. బీజేపీకి గరిష్టంగా 35, కనిష్టంగా ఐదు డివిజన్లు రానున్నాయి.ఎంఐఎంకి కనిష్టంగా 32, గరిష్టంగా46 సీట్లు వస్తాయని తేలింది. శాంతి భద్రతల అంశంలో టీఆర్ఎస్కు మార్కులు వచ్చాయని సర్వే సంస్థలు వెల్లడించాయి. మహిళలు, వృద్ధులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. అయితే వరద సాయంలో విషయంలో మాత్రం 51% మంది టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా యువత, నిరుద్యోగులు నిలిచారు. పాతబస్తీలో పట్టు కొనసాగించింది మజ్లిస్ పార్టీ. 12 నుంచి 14 సీట్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉందని అంచనా వేశారు.