పండుగల సీజన్ నేపథ్యంలో ముంచుకొస్తున్న కరోనా ముప్పు
posted on Nov 30, 2020 @ 1:14PM
అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కరోనా ఉధృతి కొంత తగ్గినట్లుగా కనిపించినప్పటికీ ప్రస్తుతం ప్రతి రోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో త్వరలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు నేపథ్యంలో అమెరికాలో ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేయడంతో పాటు బంధువులు, మిత్రులను కలిసే అవకాశం ఉంది. దీంతో ఈ సీజన్లో కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశం ఉంది.
దీనిపై అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోని ఫౌచీ అందోళన వ్యక్తం చేసారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సమావేశాలు, ప్రయాణాలు పెరుగుతాయని దీంతో కేసులు భారీ స్థాయిలో పెరుగుతాయని అయన అన్నారు. అయితే తాను ఈ విషయం ఎవరినో భయపెట్టడానికి చెప్పడం లేదని, కేవలం దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడానికే చెబుతున్నానని అయన అన్నారు.
కరోనాను మొదట్లో సమర్థంగా ఎదుర్కొన్న దేశాల్లోనూ వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోందని, ప్రజలు నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అయన అన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అప్పటివరకు ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని అయన తెలిపారు. క్రిస్మస్ తర్వాత కరోనా విజృంభణ ఏకంగా పదింతలు పెరిగే అవకాశం ఉందని, దీంతో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉందని అంటువ్యాధుల నిపుణురాలు డెబోరా బిర్క్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.