టోల్గేట్లు తొలగింపు.. ఫాస్టాగ్పై పోలీస్ కేసు..
posted on Mar 18, 2021 @ 5:55PM
ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ప్లాజాలు తొలగింపు. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తు. ఈ విషయం స్వయంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో ప్రకటించారు. మరి, టోల్ప్లాజాలు తీసేస్తే వాహనదారులు ఉచితంగా జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చా? అంటే ఆ ఛాన్స్ లేదంటున్నారు కేంద్ర మంత్రి. టోల్ప్లాజాలు తీసేస్తాం కానీ టోల్ వసూలు మాత్రం యధావిధిగా కొనసాగిస్తామన్నారు. అది ఎలాగంటే.. టోల్గేట్లు తీసేసి జీపీఎస్ సిస్టమ్తో టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు నితిన్ గడ్కరీ.
‘‘ఏడాది కల్లా దేశంలోని అన్ని టోల్బూత్లను తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్ ఆధారంగా టోల్ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం’’ అని గడ్కరీ వివరించారు.
అన్ని వాహనాల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ వస్తున్నందున.. టోల్ వసూలుకు జీపీఎస్ సాంకేతికతను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్గేట్ల దగ్గర ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్ ఆధారంగా టోల్ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది. జీపీఎస్ ఆధారంగా... వెహికిల్ కదలికలను బట్టి వాహనదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే.. అంత దూరానికి మాత్రమే టోల్ ఛార్జీలు పడతాయి. ఇది కాస్త ఊరడనిచ్చే విషయమే.
దేశవ్యాప్తంగా 93 శాతం వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. మిగతా 7శాతం మంది ఫాస్టాగ్ వాడకుండా రెట్టింపు టోల్ కడుతున్నారని చెప్పారు. ఫాస్టాగ్తో టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్టు కేంద్రమంత్రి చెప్పారు.