జగన్ హయాంలో తిరుమలలో అధర్మం నాలుగు పాదాలపై.. హుండీ కానుకలనూ వదల్లేదు!!
posted on Jul 29, 2024 @ 12:03PM
జగన్ హయాంలో తరుమల పవిత్రత మంటగలిసింది. తిరుమల దేవుని సన్నిధిలో పారిశుద్ధం నుంచి ప్రతి విషయంలోనూ పూర్తి నిర్లక్ష్యం తాండవించింది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నుంచి కొండపై హోటళ్లలో నాణ్యత కరవైంది. ఇప్పుడిప్పుడే.. అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. ఆ క్రమంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలు, అధర్మాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు ఎంతో భక్తితో వేసిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ కానుకలు దొంగతనానికి గురైన సంగతి వెలుగు చూసింది. అలా చోరీ చేసిన సొమ్ముతో ఆస్తులు కూడబెట్టుకున్న నేరస్తుడిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ఆ దొంగతోనే కుమ్ముక్కైన సంగతి ఇప్పుడు వెలుగు చూసింది. జగన్ హయాంలో టీటీడీ ఆవోగా పని చేసిన ఆధర్మాధికారి, ఎస్పీ స్థాయిలో పని చేసిన పోలీస్ అధికారి, సీఐ స్థాయి పోలీస్ అధికారులు శ్రీవారి హుండీ కానుకలను దొంగిలించిన సొత్తు నుంచి వాటా తీసుకున్న ఉదంతం విస్తుగొలుపుతోంది.
తిరుమలేశుని హుండీ కానుకల చోరీ నేరస్తుడితో ఈవో, పోలీసు అధికారులు కుమ్మక్కై చోరీ సొత్తులో వాటా తీసుకున్న విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండలి వేదికగా వెల్లడించారు. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసిన విదేశీ కరెన్సీ కానుకల చోరీకి పాల్పడిన పెద్ద జీయర్ మఠానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి పైన, ఈ సంఘటనను పక్కదారి పట్టించిన అప్పటి ఈవో ధర్మారెడ్డి , అప్పటి ఎస్పీ, సిఐలపైన, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇంతకాలం ఈ సంఘటనను బయట ప్రపంచానికి తెలియకుండా ఎందుకు తొక్కి పెట్టారో కూడా అప్పటి పాలకమండలి సమాధానం చెప్పాలని మంత్రి మండలి వేదికగా చెప్పారు. .
తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసే కానుకల ద్వారా నిత్యం కోట్లలో ఆదాయం వస్తుంది. శ్రీవారి ఆలయ వ్యవహారాల సాంప్రదాయాలను పర్యవేక్షించే ఆలయ పెద్దగా పెద్ద జీయర్ స్వామి వ్యవహరిస్తుంటారు. ఆయన వద్ద శిష్యరికం చేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి గత రెండు దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణిలో హుండి కానుకలను లెక్కిస్తుంటారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం పెద్ద జీయర్ స్వామీజీ కి చెందిన వారిని ఆలయం లోపలికి వెలుపలికి వచ్చే సమయంలో తనిఖీ చేయరు అయితే ఓ రోజు అనుకోకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరకామణికి వెళ్లి వస్తున్న రవికుమార్ ను తనిఖీ చేశారు. దీంతో ఆయన వద్ద దొంగతనంగా తీసుకెళ్తున్న యూఎస్ డాలర్లు దొరికాయి.
దీంతో విజిలెన్స్ అధికారులు మొత్తం కూపీ లాగారు. గత 20 ఏళ్లుగా పరకామణిలో కానుకలను లెక్కింపు చేస్తున్న రవికుమార్ ప్రతిరోజు ఇలా మ సీసీ కెమెరాలకు ఒక సైతం దొరకకుండా యూఎస్ డాలర్లు, విదేశీ కరెన్సీ మాత్రమే దొంగతనంగా తీసుకెళ్తుండేవాడని తేల్చారు. ఇలా విదేశీ కరెన్సీ ని యదేచ్చగా అందరి కళ్ళు కప్పి దొంగతనం చేస్తూ రవికుమార్ దాదాపు 150 కోట్లకు పైగా విలువచేసే ఆస్తులు కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. జూలై 2022లో బయటపడిన ఈ అక్రమ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నొక్కి పెట్టేందుకు అప్పటి ఈవో, ఎస్పీ, తిరుమలలో పనిచేసే ఒక సీఐ రంగంలోకి దిగారు. వ్యవహారం బయటకు పడకుండా కొంతకాలం నొక్కి పెట్టారు.
శ్రీవారి సొమ్మును నొక్కేసిన నిందితుడు రవికుమార్ వద్దనుండి ఆస్తులను జప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని అతనికి శిక్షపడేలా చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా రవికుమార్ చోరీ సొత్తుతో కూడబెట్టిన ఆస్తులలో కొన్నిటిని రవికుమార్ విరాళంగా ఇస్తున్నట్లుగా టిటిడి పేరిట రాయిం చారు. నిందితుడు రవికుమార్ పేరిట ఉన్న మరికొన్ని ఆస్తులను పోలీస్ అధికారులు తమ బంధువుల పేరిట రాయించుకున్నారు. అప్పట్లో నిందితుడు రవికుమార్ కూడా పోలీసులు తమను విచారణ పేరిట వేధిస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. రవి కుమార్ పై తేలికపాటి చిన్న పెట్టీ కేసు పెట్టారు. ఆ కేసును కూడా లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించేశారు. రవికుమార్ కు చెందిన ఆస్తులను టిటిడి పేరిట రాయించుకున్న సందర్భంలో మాత్రం ఆయన ఆస్తులు టీటీడీకి విరాళం ఇస్తున్నట్లుగా పాలకమండలిలో ఒక తీర్మానం కూడా ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని మీడియాకు వెల్లడించకుండా రహస్యంగా ఉంచేశారు. ఈ సంఘటనపై దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి శాసనమండలిలో ప్రకటన చేశారు. విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.