కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసిన ఎవిడెన్స్ ఉంది: ఈడీ
posted on Jun 19, 2024 @ 5:32PM
అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే ఉద్దేశ్యంతో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించింది. ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అనూహ్యంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ బుధవారం కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
పీఎంఎల్ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా ఆయనను నిందితుడిగా పేర్కొనలేదన్నారు. కిందికోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మే 10న సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆయనను అరెస్ట్ చేయడానికి ముందే ఆధారాలు సేకరించినట్లు తెలిపింది.