రేషన్ బియ్యం రూటు మారింది.
posted on Dec 10, 2024 @ 2:43PM
నేర స్వరూపం మాత్రమే మారింది. కానీ నేరం మారలేదు. ఎపిలో రేషన్ బియ్యం రూటు మారింది. కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం సీజ్ చేసిన పౌరసరఫరాల శాఖ అక్రమ రవాణాను ఏ మాత్రం అరికట్టలేకపోతుంది. రేషన్ బియ్యం ఆప్రికా దేశానికి తరలి వెళుతున్నట్టు దర్యాప్తులో తేలడంతో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కాకినాడ పోర్ట్ సీజ్ అయితేనేం విశాఖ పోర్ట్ ఉంది కదా అని స్మగ్లర్లు రూటు మార్చడం ఇప్పుడు తల నొప్పిగా మారింది. మిల్లుల్లో అక్రమంగా ఉంచిన బియ్యం నిల్వలను అధికారుల కళ్లుగప్పి బోర్డర్ దాటించేస్తున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో రూటు మార్చిన బియ్యం దొంగలు విశాఖ పోర్టును అడ్డాగా మార్చుకున్నారు. తాజాగా కంటెయినర్లో 483 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. రేషన్ బియ్యం విదేశాలకు తరలించడం వ్యవస్థీకృత నేరం కావడంతో పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ స్మగ్లర్లు బెదరడం లేదు. గ్రీన్ చానెల్ పేరుతో వైకాపా మాఫియా ఇప్పటికీ చెల రేగిపోతుంది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోనూ మిల్లుల్లో పరిశీలించగా భారీగా చౌకబియ్యం పట్టుబడ్డాయి. డిసెంబరు 5న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో 15 వందల బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు తదితర జిల్లాల్లోనూ ఇటీవల భారీగా చౌక బియ్యం పట్టుబడ్డాయి. బాపట్ల జిల్లాలోని పలు రైస్మిల్లుల నుంచి మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాలకు అక్రమ రవాణా, రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తేలింది. పలుచోట్ల విజిలెన్స్ బృందాలూ చౌకబియ్యాన్ని సీజ్ చేస్తున్నాయి.కాకినాడ పోర్టులో బియ్యం సీజ్ అయిన తర్వాత కూడా చెలరేగిపోవడం చూస్తుంటే స్మగ్లర్లకు భయం , భక్తి లేకుండా పోయిందని అర్థం చేసుకోవాలి.