ముప్పై ఐదు అడుగుల నుంచి వంద అడుగులకు జారిపోయిన బావిలో పడ్డ బాలుడు...

తమిళనాడులో చిన్న బాలుడు బోరు బావిలో పడి మూడు రోజులైంది. ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడా లేదా ఇదే ఇప్పుడు తమిళనాడుతో పాటు దక్షిణాది మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం. ముప్పై ఐదు అడుగుల లోతు నుంచి బాబు వంద అడుగుల లోతు లోకి జారిపోవడంతో చిన్నారి క్షేమంగా వస్తాడా రాడా అని తల్లితండ్రులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా మనప్పారై గ్రామంలో ఇంటి దగ్గర ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు రెండున్నరేళ్ల సుజిత్. ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు సుజిత్ ను సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

సుజిత్ బోరు బావిలో ముప్పై ఆరు అడుగుల లోతులో ఉన్నట్టు మొదట గుర్తించారు అయితే, సహాయక బృందాలు బోరు బావికి సమాంతరంగా గొయ్యి తీయడం ప్రారంభించాక ముప్పై ఐదు అడుగుల దగ్గర నుంచి ఏకంగా వంద అడుగులకు జారిపోయాడు. మొత్తం ఆరు వందల అడుగుల లోతులో వేసిన బోరులో బాలుడు ప్రస్తుతం వంద అడుగుల దగ్గర చిక్కుకున్నట్లు గుర్తించి తీస్తున్న గొయ్యిని మరింత లోతుగా తవ్వటం ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణులు ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ కు చెందిన ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

వైద్యుల బృందం ఒకటి అక్కడే ఉంటూ బోరుబావి లోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతోంది. బోరు బావిలో ముప్పై ఐదు అడుగుల లోతులో సుజిత్ ఉన్నప్పుడు కాస్త ధైర్యంగా ఉన్న అతని తల్లిదండ్రులు వంద అడుగులకు జారిపోయాక కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణమొక యుగంగా గడుపుతూ అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి విజయ భాస్కర్ ఘటనా స్థలం లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వస్తున్న ప్రజలు సుజిత్ క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. అతను క్షేమంగా బయటకు వచ్చే సందర్భం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని దేవుడిని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Teluguone gnews banner