ఆంధ్ర ప్రజలను కాదు పాలకులను తిట్టా! తెలంగాణ మంత్రి కవరింగ్..
posted on Jun 23, 2021 @ 2:37PM
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు, ఏపీ మంత్రులతో పాటు టీఆర్ఎస్, వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మంగళవారం మహబూబ్ నగర్ లో జరిగిన సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఏపీ ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మంత్రి వేముల మాటలపై ఏపీ జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏపీకి చెందిన వివిధ పార్టీల తీవ్రంగానే స్పందించారు. తెలుగు వారంతా ఒక్కటేనని ప్రశాంత్రెడ్డి గుర్తించాలని హితవు పలికారు. ఏపీ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రజలపై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను చేసిన కామెంట్లు ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి చేసినవి కాదని, ఆంధ్రపాలకులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏడేళ్లుగా తెలుగు ప్రజల మధ్య సోదరభావం ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలంతా బాగుపడాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని, ఏపీ అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నష్టపోతుందనేదే తమ బాధ అని చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ అడ్డుపడలేదా? అని ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ నీళ్లను ఆయన ఆంధ్రాకు తరలించుకుపోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వైఎస్సార్ను మించి ఏపీ సీఎం జగన్ జగన్ ఎక్కువ నీరు తరలిస్తున్నారని మరోసారి విరుచుకుపడ్డారు ప్రశాంత్ రెడ్డి. కృష్ణాపై ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులు నష్టపోతారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నీటివాటీ తేల్చకుండా జాప్యం చేస్తున్న కేంద్ర సర్కారు తీరు సరికాదన్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పట్ల తాము నిరసన తెలుపుతామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.