తెలంగాణా హైకోర్టు ఏర్పాటుకి హైకోర్టు బ్రేక్
posted on Mar 24, 2015 @ 10:48AM
ఇక నేడో రేపో తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో స్వయంగా హైకోర్టు ధర్మాసనమే దానిని వ్యతిరేకించడం విశేషం. కల్యాణ్ జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై వేయబడిన ఒక పిటిషన్ పై స్పందిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంటుంది తప్ప తెలంగాణా రాష్ట్రానికి కాదని స్పష్టంగా పేర్కొంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకొంటే ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణా రాష్ట్రానికే చెందుతుంది గనుక ఇప్పుడు వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని, ఆవిధంగా చేయడం విభజన బిల్లుకి వ్యతిరేకమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. విభజన బిల్లులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు ఏర్పాటు చేసుకొనేవరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు గా కొనసాగుతుందని స్పష్టంగా పేర్కొనబడిందని, అందుకు నిర్దిష్ట కాల పరిమితి కూడా పేర్కొనబడలేదు కనుక తెలంగాణా రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్రన్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణకు వేరేగా హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని కూడా కోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఒకవేళ ఆవిధంగా చేయడలచుకొంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 31ని సవరించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు విభజన విషయంపై ఇరు రాష్ట్రాలు కౌంటర్ ఫైల్ చేయాలని కోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణాకి హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు ఆందోళనలు చేయరాదని, ఎవరయినా తమ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.