శ్రీసిటీలో ట్రక్కుల తయారీ కర్మాగారం ఏర్పాటుకి ఇసుజు సిద్దం
posted on Mar 24, 2015 8:59AM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టులపై పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రెండు నెలల క్రితం జపాన్ పర్యటించారు. తత్ఫలితంగా ఇప్పుడు జపాన్ కి చెందిన ఇసుజు ట్రక్కుల తయారీ సంస్థ చిత్తూరులో శ్రీ సిటీ వద్ద తమకు అన్ని సదుపాయాలూ కల్పిస్తే రూ. 1,500 కోట్ల భారీ పెట్టుబడితో ట్రక్కుల తయారీ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తకాసి తెలియజేసారు. తమ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తే సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయానికి తమ కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని తకాసి తెలిపారు. అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
శ్రీ సిటీ వద్దనే ప్రముఖ హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ త్వరలో నిర్మాణ కార్యక్రామాలు ఆరంభించబోతోంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 543 ఎకరాలను కేటాయించింది. ఇటువంటి భారీ సంస్థ రాష్ట్రానికి వచ్చినట్లయితే, దానితో బాటు వందలాది అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. వాటిద్వారా కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.