తెలుగుదేశం నాయకుడు వరుపుల రాజా కన్నుమూత
posted on Mar 5, 2023 7:47AM
తెలుగుదేశం నాయకుడు వరుపుల రాజా గుండెపోటుతో కన్నుమూశారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వరుపుల రాజా శనివారం (మార్చి 4) రాత్రి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు.
ఆయన వయసు 47 సంవత్సరాలు. ప్రస్తుతం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల తెలుగుదేవం ఇన్ చార్జ్ గా ఉన్న వరుపుల రాజా గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన శనివారం మార్చి 3) సాయంత్రమే స్వగ్రామమైన ప్రత్తిపాడుకు చేరుకున్నారు. తన నివాసంలో పార్టీ నేతలతో రాత్రి వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తరువాత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వరుపుల రాజా ప్రారంభించిన రాజా.. డీసీసీబీ చైర్మన్గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్గా పనిచేశారు. గత ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరుపుల రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజా మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయ స్నేహితుడైన రాజా ఆకస్మిక మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పేర్కొన్నారు.