నియంత 2.0... అరెస్టులపై ఆగ్రహం..
posted on Dec 17, 2021 @ 10:39AM
ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బ్రిటీష్ నియంత పాలన 2.0లా జగన్ రెడ్డి పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పాదయాత్ర విజయవంతం కావటంతో వైసీపీ నేతలు కడుపుమంటతో బాధపడుతున్నారని అన్నారు. అందుకే అమరావతి రైతుల మహాసభకు కోర్టు అనుమతిచ్చినా.. ప్రజలు సభకు వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్నారని అచ్చెన్న తప్పుబట్టారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో పోలవరంలో ఏ పనులు చేశారో, పోలవరం నిర్వాసితులకు ఏం న్యాయం చేశారో మంత్రి, ముఖ్యమంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ఆంక్షలతో అడ్డుకోవటం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రతిపక్షంలో నోటికొచ్చినట్టు హామిలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.