జగన్ రెడ్డి.. అన్ని రాసుకుంటున్నాం ! చంద్రబాబు ఉగ్రరూపం
posted on Jul 13, 2021 @ 4:43PM
జగన్ రెడ్డి సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
సంగం డెయిరీ కేసులో జైలుకు వెళ్లివచ్చిన పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు జిల్లా, చింతపూడిలో ధూళిపాళ్ల నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ధూళిపాళ్లతో పాటు ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అక్రమ కేసులకు భయపడవద్దని, దీనిపై న్యాయ పోరాటం చేద్దామని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ధూళిపాళ్ల నరేంద్రకు ప్రజలు కూడా అండగా నిలవాలన్నారు చంద్రబాబు. వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాబు విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదు.. చట్ట వ్యతిరేకంగా ప్రజల్ని, టీడీపీ నేతలను ఎలా హింసిస్తున్నారో వాటన్నింటినీ గుర్తు పెట్టుకుంటాం. భవిష్యత్లో అన్నింటిపైనా సమీక్షలు చేస్తామని చెప్పారు. రాయలసీమలో ముఠాకక్షలపై కఠినంగా వ్యవహరించి ప్రశాంతత తీసుకొచ్చామని..అక్కడ ఇప్పుడు మళ్లీ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు.