ఎంపిపై థర్డ్ డిగ్రీనా! జగన్ కళ్లలో ఆనందం కోసం ఇంత దారుణమా!
posted on May 15, 2021 @ 7:45PM
లోక్ సభ ఎంపి రఘురామకృష్ణంరాజును గాయాలయ్యేలా కొట్టడం పోలీసుల దమన కాండకు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులో అదుపులోకి తీసుకున్న ఎంపిని పోలీసులు ఏవిధంగా శారీరక హింసకు గురిచేస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ కళ్లలో ఆనందం కోసం అధికారులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు. అతను నేరస్తుడు కాదు ప్రభుత్వ అక్రమ కేసులొ నిందితుడు మాత్రమేనని చెప్పారు. కోవిద్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగుంపులుగా వెళ్లి అరెస్టు చేయడమే పెద్ద నేరమని, ఇప్పుడు థర్డ్ డిగ్రీ అమలుచేయడం మరో తప్పని చంద్రబాబు మండిపడ్డారు.
పోలీసు కస్టడీలో ఉన్న సామాన్య పౌరుడిని కూడా కొట్టే హక్కు పోలీసులకు ఉండదని చట్టం చెబుతోందన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చట్టం నుంచి ఏమైనా మినహాయింపు ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికి హింసించడం కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు యావత్ పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చగా మారిందని ధ్వజమెత్తారు. ఈ చర్యలన్నీ ఫ్యాక్షన్ వ్యవస్థను తలపిస్తున్నాయి తప్ప రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నట్లుగా లేదన్నారు చంద్రబాబు.
ఎంపి స్థాయిలో ఉన్న వ్యక్తిపైనే పోలీసులు ఈవిధంగా జులుం ప్రదర్శించారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి జమానాలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరికొత్త చట్టాలను అమలుచేస్తున్నట్లు కన్పిస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకంగా సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లోనే థర్డ్ డిగ్రీ అమలుచేయడంపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన సిబిసిఐడి ఉన్నతాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా థర్డ్ డిగ్రీ అమలుచేయడం అనాగరికమన్నారు చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసుస్టేషన్లోనే హింసించాలని ఏ చట్టం చెబుతోందన్నారు. రఘురామ నడవలేని పరిస్థితులో ఉన్నారంటే ఏవిధంగా ఆయనను హింసించారో అర్థమవుతుందన్నారు. పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలని, తక్షణమే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు కోరారు.