బిఏసీ సమావేశం నుంచి టీడీపీ వాకౌట్

ఆదివారం ఉదయం జరిగిన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఎసి) సమావేశం నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు నేతలు వాకౌట్ చేశారు. శాసనసభ సమావేశాలు 4రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సమావేశం నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. 20 అంశాలపై 20 రోజులపాటు సమావేశాలు జరపాలని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కోరారు. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీ నామా, కళంకిత మంత్రులపై ముఖ్యమంత్రి వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, శోభానాగి రెడ్డి హాజరయ్యారు. టీడీపీ నుంచి మోత్కుపల్లి నరసింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర పార్టీల శాసనసభ పక్షనేతలు హాజరయ్యారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.