చంద్రబాబు ప్రయాణం ఎటువైపు?

తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ వట్టిపోయింది. పార్టీకి ఎంతో కాలంగా అండగా నిలబడ్డ చాలామంది దిగ్గజాలు ప్రత్యేక రాష్ట్రం స్లోగన్ తో రకరకాల దారులుపట్టిపోయారు. ఇప్పుడు మళ్లీ వాళ్లందర్నీ తిరిగి పచ్చజెండాకిందికి తీసుకురావడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైతే తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయాలనికూడా ఆయన నిర్ణయించుకున్నారు. అక్టోబర్ రెండు నుంచి బాబు మొదలుపెట్టబోయే పాదయాత్రను మామూలుగా ఎప్పటిలాగే తిరుపతి నుంచి ప్రారంభించాలి. ఏ పని మొదలుపెట్టినా తిరుపతినుంచే దాన్ని ప్రారంభించడం చంద్రబాబు సెంటిమెంట్. కానీ.. ఈ సారి తెలంగాణ వాదుల్ని ఆకట్టుకునేందుకు తెలంగాణలోని ఏదో ఒక ప్రాంతంనుంచి యాత్రని మొదలుపెట్టాలని చంద్రబాబుపై కార్యకర్తలు, నేతలనుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలిగి అటకెక్కిన వేణుగోపాలాచారి కిందికి దిగి మళ్లీ బాబుకి జై కొడితే ఆయన నియోజకవర్గంనుంచే యాత్ర ప్రారంభం కావొచ్చని చాలామంది అనుకుంటున్నారు. కానీ.. బాబుకి ఎన్నికలముందు యాత్రను తిరుపతినుంచి మొదలుపెడితేనే కలిసొస్తుందని కొందరు నేతలు వాదిస్తున్నారు. ఇద్దరిమధ్యా నలిగిపోతున్న చంద్రబాబు ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఏదేమైతేనేం మా బాబు మళ్లీ తెలంగాణకి జై కొడుతున్నాడుకదా.. అని టిడిపికి చెందిన తెలంగాణ వాదులంతా సంతోషంతో ఉన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.