లీటర్ పెట్రోల్ పై రూ. 3 తగ్గించిన స్టాలిన్.. ప్రజలను బాదుడే జగనన్న స్టైల్?
posted on Aug 13, 2021 @ 10:06PM
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేట్ సెంచరీ ఎప్పుడో దాటేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రేట్ 110 రూపాయలకు చేరువలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ రేటు కూడా దూసుకుపోతోంది. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్కుకు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వందకు దరిదాపులో ఉంది లీటర్ డీజిల్ ధర. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో పెట్రోల్ పై రూ.13 డీజిల్ పై రూ.16 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రతి రాష్ట్రానికి వ్యాట్ శాతంలో మార్పు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఆయిల్ ధరలు మరింత భగ్గుమంటున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం ట్యాక్సులు భారీగా పెంచడంతో దక్షిణాదిలో ఏపీలోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో జనాలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు మాత్రం ఖజనా నింపుకునేందుకు భారం మోపతూనే ఉన్నాయి. కేంద్ర సర్కార్ వల్లే ధరలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రాలే పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం చెబుతూ జనాల నడ్డి విరుస్తున్నాయి. ఏపీ సర్కార్ పెంచిన ట్యాక్సులు తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు రాష్ట్రాల చేతుల్లో లేదంటూ కవరింగ్ చేసుకుంటోంది.
అయితే తాజాగా తమిళనాడు సర్కార్ మాత్రం తమ ప్రజలపై భారం పడకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తూ తమిళనాడు సీఎం స్టాలిల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ ధర లీటరుకు రూ.3 తగ్గిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించారు. తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆ విషయాన్ని సభలో ప్రకటించారు. పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో రూ.3 తగ్గించామని చెప్పారు. ఇప్పటిదాకా లీటర్ పెట్రోల్ పై రూ.32.90 ఎక్సైజ్ సుంకం విధిస్తుండగా తాజా ప్రకటనతో అది రూ.29.90కు తగ్గింది.
స్టాలిన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు ఏటా రూ.1160 కోట్లు నష్టం వాటిల్లనుంది. అయితే సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.49 లీటర్ డీజిల్ ధర రూ.94.39గా ఉంది. స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా పెట్రోల్ రేట్లు తగ్గించాలని నెటిజన్లు కోరుతున్నారు. స్టాలిన్ నిర్ణయంతో ఏపీలోని జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ధరల తగ్గింపు రాష్ట్రాల పరిధిలో లేదంటున్న ప్రభుత్వం.. స్ఠాలిన్ నిర్ణయంపై ఏం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికేనా ప్రజలపై బాదుడు ఆపండి జగన్ రెడ్డి గారు అంటూ పోస్టులు పెడుతున్నారు.