ఏసీబీకి సుప్రీం నోటీసులు.. రేవంత్రెడ్డికి ఊరట!
posted on May 28, 2021 @ 3:01PM
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్రెడ్డి.. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్పై సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాంపల్లిలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్ దొరికింది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్షీట్లో చంద్రబాబు పేరు కనిపించలేదు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్షీట్లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో రాయబారం నడిపినట్టుగా రేవంత్రెడ్డిపై చార్జ్షీట్లో చెప్పారు. టీడీపీ నేత వేం నరేందర్రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఛార్జ్షీట్లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్రెడ్డిని పేర్కొంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది.
2015లో వెలుగు చూసిన ఈ కేసులో అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. తాజాగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది ఈడీ. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.