సీఎం ఓఎస్డీ పీఏ నంటూ మోసాలు..
posted on Apr 1, 2021 @ 10:58AM
చెప్పేవాడికి వినేవాడు లోకువైనట్టు. వారు ఏది చెప్పిన నమ్మే వాళ్ళు ఉన్నంత కాలం వారికి పండగే. మోసం చేయాలంటే భయం కాదు భక్తి అని నమ్మాడు అతను. అందుకే దేవుడి విగ్రహాలే తన పెట్టుబడి. మాటలే అతడి డబ్బుల మూటలు. తాను సీఎం ఓఎస్డీ పీఏ నంటూ ఘరానా మోసాలు చేశాడు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలా.. ఉద్యోగం కావాలా.. గవర్నమెంట్ స్థలాలు రిజిస్టేషన్ కావాలా.. వీఐపీ ఇళ్లు కావాలా.. ఏదైనా పని చక చక చేస్తాను అని చెప్పాడు. ఎందుకంటే అతను సీఎం ఓఎస్డీ పీఏ నంటూ జనాలను నమ్మించాడు. తన బాధితుల్లో సామీజీలు, డాక్టర్ వైఫ్, ప్రొఫెసర్స్ కూడా మోసపోయారంటే అతని ఎంతటి చాణుక్యుడో చూడండి మరి.
ముందు మనుషులను టార్గెట్ చేయడం. తర్వాత ఉజ్జయిని మహంకాళి..లక్ష్మీదేవీల పంచలోహ ప్రతిమలు గిఫ్ట్ గా ఇవ్వడం. ఆ తర్వాత మాటల్లోకి దించి ఇళ్లు, ఉద్యోగాలు కావాలంటూ ఆశ్రయించిన వారిని ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లి వారిని నమ్మించి మసిపూసి మారేడు కాయ చేయడం. వారు మోసం పసిగట్టే లోపు చిక్కకుండా చాకచక్యంగా అదృశ్యమవడం. నమ్మించి మోసం చేయాలంటే భక్తి, ఆతిథ్యాన్ని మించినవి అస్రాలు లేవని తెలుకున్నాడు. అవే తన అస్త్రాలుగా మలుచుకున్నాడు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ప్రముఖ ఆలయాలు, ఆశ్రమాలకు వెళ్లి అక్కడే బాధితులను సెలెక్ట్ చేసుకుని మరీ టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కూకట్పల్లి-మియాపూర్ రూట్ లో ఉన్న ఓ ఆశ్రమానికి సుధాకర్ వన్ ఇయర్ నుండి తరచూ వెళ్లేవాడు. తన ఫార్చూనర్ కారు, అంగరక్షకుల హంగామా చూసి స్వామీజీ అనుచరులు అతడికి ఎక్కువ మర్యాదలు చేసేవారు. కొన్ని నెలలకు ముందు ఆశ్రమానికి వెళ్లిన అతను అక్కడున్న 50 మంది భక్తులు సహా, స్వామీజీ అనుచరులకు మహంకాళి అమ్మవారి పంచలోహ ప్రతిమలను బహుమతులు ప్రధానం చేశాడు. ఈ క్రమంలో ఒక బ్యాంకు మేనేజర్ భార్య పరిచయమైంది. ఆమెను అమ్మా అని పిలుస్తూ పేదలకు రెండు పడకలగదుల ఇళ్లు ఇప్పిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. తనకు తెలిసిన వారున్నారని ఆమె చెప్పగా, రూ.5 లక్షల చొప్పున ఇస్తే మియాపూర్లో ఇప్పిస్తానన్నాడు. మీకు, మీ స్నేహితులకు ప్రత్యేకంగా వీఐపీ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించడంతో ఐదు నెలల క్రితం ఆమె రూ.1.23 కోట్లు వసూలు చేసి ఇచ్చింది. సంక్రాంతిలోపు ఇళ్లు ఇప్పిస్తానని చెప్పిన సుధాకర్ తర్వాత అటువైపు వెళ్లలేదు.
ఇది అలా ఉండగా సుధాకర్ మాయాజాలంలో మాములు మనుషులే కాదు. ఇద్దరు స్వామీజీలు చిక్కుకుని రూ.60 లక్షలు సమర్పించుకున్నట్టు తేలింది. అంతేకాదు..అతడి డాబూ దర్పం చూసి మోసపోయిన సికింద్రాబాద్లో ఉంటున్న ప్రధాన పార్టీ గల్లీ లీడర్ నామినేటెడ్ పోస్టు కోసం డబ్బులిచ్చేందుకు సిద్ధమయ్యాడంటే అతని మాట తీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నిందితుని అరెస్టు వార్త తెలుసుకున్న ఆయన ప్రస్తుతం హమ్మయ్యా! అని ఊపిరిపీల్చుకున్నాడట.
ఉస్మానియా విశ్వవిద్యాలయా ప్రాంతంలో ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అనే బోర్డు కూడా ఉంది. ఆ భూమిలో 600 చదరపు గజాల స్థలం ఇప్పిస్తానంటూ సుధాకర్ ఒక ప్రొఫెసర్ను నమ్మించాడు. ఈ స్థలం తాలూకూ హక్కులు ప్రభుత్వానివేనని, ఎవరికైనా కేటాయించే అధికారం సీఎం కార్యాలయానికి ఉందంటూ నకిలీ ఉత్తర్వులు ఆ ప్రొఫెసర్కు చూపించాడు. రూ.33 లక్షలు తీసుకున్న తర్వాత నోటరీ సంతకాలు చేయించి ప్రొఫెసర్ పేరు మీద స్థలాన్ని రాసిచ్చాడు. వీటి ఆధారంగా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆయన వెళ్లారు. ప్రభుత్వ అధికారులు అడ్డుకోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన ఓయూ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం సుధాకర్ పరిచయమయ్యాడని, అతని గుర్తింపు కార్డు, కారు, వ్యక్తిగత అంగరక్షకులను చూసి సీఎం ఓఎస్డీ వ్యక్తిగత సహాయకుడేనని నమ్మానంటూ పోలీసుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.