సీఎం జగన్ పాలనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
posted on Dec 30, 2020 @ 9:51AM
ఏపీ సీఎం జగన్ పరిపాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. "అయ్యా జగన్మోహన్రెడ్డి.. నువ్వు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే.. అది అప్పులు, అవినీతే" అంటూ సోము వీర్రాజు సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిన్న నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సీఎం అప్పులతో పాలన చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే గానీ, జగన్ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదన్నారు. ఒక్క ఇళ్ల స్థలాల పంపిణీకి 9వేల కోట్లు నిధులు కేటాయించి, అందులో సగం బొక్కేశారని ఆరోపించారు.
మరోపక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు కేటాయిస్తే, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల 8 లక్షల ఇళ్లు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలోని ఎర్రచందనం స్మగ్లర్లు అంతా వైసీపీ నేతల అనుచరులేనని అయన ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుకనూ దోపిడీ చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అందుకే వారంతా పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ ప్రభుత్వ దోపిడీ విధానాలను ఎండగడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తమపార్టీ ఉద్యమం చేస్తుందని అయన చెప్పారు. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు.