కూటమి కోటాలో సోముకు ఎమ్మెల్సీ.. రగిలిపోతున్న తెలుగుదేశం శ్రేణులు
posted on Mar 10, 2025 @ 4:23PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం లభిస్తుందని భావించిన ఇద్దరు తెలుగుదేశం నేతలకు తీవ్ర నిరాశ మిగిలింది. వారిలో ఒకరు పిఠాపురం వర్మ కాగా మరొకరు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. వీరిరువురూ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. ఆశించారనడం కంటే పార్టీ అధిష్ఠానమే వారికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. అయితే కారణాలేమైనా తెలుగుదేశం అధిష్ఠానం వీరిద్దరినీ పక్కన పెట్టింది. ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించడం పట్ల తెలుగుదేశంలో ఎవరి నుంచీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ బీజేపీకి ఒక స్థానం కేటాయించడం పట్ల క్యాడర్ లోనే కాకుండా.. పార్టీ నేతలలో కూడా అభ్యంతరం, అసహనం వ్యక్తం చేస్తున్నది.
బీజేపీ కోసం ప్రతి సారీ తెలుగుదేశం పార్టీయే ఎందుకు త్యాగాలు చేయాలన్న ప్రశ్న కూడా గట్టిగా వినవస్తున్నది. గతంలో ఆర్ కృష్ణయ్య విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలోనూ బీజేపీ పట్టుబట్టి ఒక స్థానాన్ని తెలుగుదేశం నుంచి లాగేసుకుందన్న అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అదే విధంగా ఇటీవల విజయసాయిరెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని కూడా బీజేపీ అభ్యర్థితోనే భర్తీ చేయాలని ఆ పార్టీ పట్టుబడుతున్నట్లుగా తెలుగుదేశం వర్గాలలో వినిపిస్తోంది. అది పక్కన పెడితే..
ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం బీజేపీ కోసం త్యాగం చేయడం వల్ల పార్టీ ప్రతిపక్షంలో ఉండగా త్యాగాలు చేసి, పోరాటాలు చేసిన నేతలకు అవకాశం దక్కకుండా పోతున్నది. వారిలో ప్రధానంగా పిఠాపురం వర్మ, దేవినేని ఉమ ఉన్నారు. గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా పోత్తు ధర్మంతో సీటు త్యాగం చేసిన దేవినేని ఉమకూ దాదాపు ఇలాంటి హామీయే దక్కింది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో పిఠాపురం వర్మ ఓపెన్ అయిపోయారంటున్నారు. తన సన్నిహితుల వద్ద పార్టీ కోసం త్యాగాలు చేసి తప్పు చేశానని, త్యాగం చేసిన తనకు తగిన శాస్తే జరిగిందనీ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే తరువాత మీడియా సమావేశంలో పార్టీ నిర్ణయమే శిరోధ్యర్యం అని ప్రకటించారనుకోండి అది వేరే సంగతి. ఇక దేవినేని ఉమ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయనప్పటికీ, తనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోవడం పట్ల ఆయన నిరాశకు గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి బీజేపీలో ఎమ్మెల్సీ స్థానానికి తగిన నేత లేరనే చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆ పార్టీతో అంటకాగిన సోము వీర్రాజుకు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం తెలుగుదేశం శ్రేణులలో అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ కలిగిస్తున్నది. నిజానికి బీజేపీ తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు కారణంగా ఇప్పటికే తనకు ఉన్న స్టేక్ కంటే ఎక్కువ లాభం పొందింది. ఇదే పరిస్థితి ముందుముందు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ఖాళీ అయ్యే ప్రతి పదవీ తెలుదగుదేశం కూటమికే దక్కుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెంచి బీజేపీ కూడా తగుదునమ్మా అంటూ పదవుల కోసం పోటీ పడుతుందని అంటున్నారు. మొత్తం మీద కష్టమూ తెలుగుదేశందే, త్యాగాలూ ఆ పార్టీవే అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న ఆవేదన పార్టీ శ్రేణులలో వ్యక్తమౌతోంది.