సీఈసీ బీజేపీలో ఒక శాఖ! శివసేన నేత సంచలన ఆరోపణలు
posted on Oct 31, 2020 @ 7:57PM
సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘాన్నే టార్గెట్ చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖగా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ సంజయ్ రౌత్. ఎన్నికల కమిషన్ బీజేపీకి కొమ్ము కాస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ హామీ ఇచ్చింది. దానిపై కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దానిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్.. అయితే బీజేపీ కరోనా వ్యాక్సిన్ హామీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఎన్నికల వేళ బిహార్లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్ రౌత్.
బీహార్ ఎన్నికలపై సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ చీఫ్, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు. ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అంటూ తేజస్విని ఉద్దేశించి మాట్లాడారు సంజయ్ రౌత్.