ఏప్రిల్ లో కరోనా ఉప్పెన! 100 రోజుల డేంజర్
posted on Mar 26, 2021 8:32AM
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడు వారాలుగా కేసులు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రోజువారి కేసులు 50 వేలకు పైగానే వస్తున్నాయి. గతేడాది నవంబర్ ఆరో తేదీ తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్ ,కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మహమ్మారి ప్రభావంతో ప్రజలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
కరోనా కేసులు పెరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే కరోనాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. దేశంలో కరోనా విజృంభణ తీరును బట్టి చూస్తే రెండో వేవ్ ప్రారంభమైందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక తెలిపింది. ఫిబ్రవరి 15 మొదలుకొని వంద రోజుల పాటు రెండో వేవ్ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏప్రిల్ ద్వితీయార్ధంలో రోజువారీ కేసులు గరిష్ఠస్థాయికి చేరతాయని తెలిపింది.
కేసులు పెరుగుతున్న తీరును బట్టి చూస్తే మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా రెండో వేవ్లో 25 లక్షల కొత్త కేసులు ఉండి ఉంటాయని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో కరోనా నిబంధనలు, ఆంక్షల్ని తేలిగ్గా తీసుకోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయని నివేదిక తెలిపింది. ఇక ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న లాక్డౌన్లు, ఆంక్షల ప్రభావం వచ్చే నెలలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని ఎస్బీఐ నివేదిక సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాలు సగటున 34 లక్షల మందికి టీకా అందిస్తున్నాయని తెలిపింది. దీన్ని 40-45 లక్షలకు పెంచాలని సూచించింది.