జూన్ 25 ఇక నుంచి ‘రాజ్యాంగ హత్య దినం’
posted on Jul 12, 2024 @ 5:08PM
దాదాపు 50 సంవత్సరాల క్రితం దేశంలో ఎమర్జెన్సీని విధించిన జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్య దినం’ (సంవిధాన్ హత్యా దివస్)గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజలు అనుభవించిన హింసను జూన్ 25న గుర్తుచేసుకుంటామని పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైళ్ళలో పెట్టారు. మీడియా గొంతును నొక్కేశారు. ఆ చీకటి రోజులకు నిరసనగా జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివస్’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందాం’’ అని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.