నేనేంటో విజయసాయికి తెలియదు.. ఈ తప్పు ఎందుకు చేశానా అని బాధపడే స్థాయికి తీసుకెళ్తా
posted on Oct 3, 2020 @ 1:16PM
టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను అక్రమ కట్టడమని ఆరోపిస్తూ జీవీఎంసీ అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది లీగల్ గా వెళ్లేంత పెద్ద అంశం కాదని, 24 గంటల్లో ఈ సమస్యను క్లోజ్ చేస్తానని చెప్పారు. తనకున్న ఆస్తులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయన్న ఆయన.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తానేంటో సీఎం జగన్కు తెలుసునని అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సబ్బం హరి నిప్పులు చెరిగారు. బహుషా విజయసాయికి తన గురించి ఇంకా తెలియదనుకుంటానని అన్నారు. విశాఖలో కూర్చొని విశాఖలో డ్యాన్స్ చేద్దామకుంటున్నారని.. ఆయన డ్యాన్స్ ని కట్టిస్తానని అన్నారు. తన గురించి తెలియక ఏదో చేద్దామనుకుంటున్నారని.. ఇలాంటి తప్పు ఎందుకు చేశానా? అని బాధ పడే స్థాయికి తీసుకెళ్తానని సబ్బం హరి అన్నారు.
మరోవైపు, సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేయడంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదు" అని చంద్రబాబు విమర్శించారు.