వ్యాక్సిన్ భారీ ఉత్పత్తి కోసం భారత్ వైపు రష్యా చూపు..
posted on Aug 21, 2020 @ 9:41AM
ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్ను ఆమోదించిన రష్యా ఇప్పుడు ఈ టీకా డోసుల భారీ ఉత్పత్తి కోసం భారత్ వైపు చూస్తోంది. "స్పుత్నిక్ v" అని పిలవబడుతున్న ఈ వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అందరికి అందించాలంటే, ఈ టీకాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నభారత్ తోనే అది సాధ్యం అవుతుందని రష్యా తాజాగా విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్ v" ను భారీ ఎత్తున తయారు చేసేందుకు భారత్ సహకరించాలని రష్యా అధికారికంగా అభ్యర్థించింది. దీని కోసం భారత్ తమతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాలని కోరుకుంటున్నామని, అప్పుడే వ్యాక్సిన్ డోస్ లను పెద్ద మొత్తంలో తయారు చేయగలమని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ వ్యాఖ్యానించారు. ఔషధాలను భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న దేశాలలో భారత్ ఒకటని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
కొద్దీ రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ -19 టీకాను తయారు చేసినట్లు ప్రకటించారు. ఇది 'చాలా ప్రభావవంతమైన' పద్ధతిలో పనిచేస్తుందని, అలాగే వ్యాధికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని వారు తెలుపుతున్నారు. ఈ వ్యాక్సిన్ ను గమలేయా ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆర్డిఐఎఫ్ కలిసి అభివృద్ధి చేసాయి.
"ప్రపంచం మొత్తానికి సరిపడా ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ప్రస్తుతం మేము ఇండియాతో భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. గమేలియా వ్యాక్సిన్ ను భారీగా, అనుకున్న సమయానికి తయారు చేసి ఇవ్వగల సత్తా భారత్ కు ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే, ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యం తప్పనిసరి. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాం" అని కిరిల్ దిమిత్రేవ్ అన్నారు. దీనికోసం రష్యాకు ఇతర దేశాల సహకారం ఉంటేనే వ్యాక్సిన్ మరింత త్వరగా అందరికీ దగ్గరవుతుందని తెలిపారు. తమ వ్యాక్సిన్ భారీ స్థాయిలో ఉత్పత్తి కోసం భారతదేశం, బ్రెజిల్, దక్షిణ కొరియా, క్యూబా వంటి దేశాలలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అయన తెలిపారు.
అంతేకాకుండా తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కేవలం రష్యాలో మాత్రమే కాకుండా, యూఏఈ, సౌదీ అరేబియాలోనూ జరుగుతున్నాయని, బహుశా బ్రెజిల్, ఇండియాలో కూడా జరుగుతాయని, కనీసం ఐదారు దేశాల్లో ఈ వ్యాక్సిన్ తయారీ దిశగా డీల్స్ కుదుర్చుకోవాలని తాము కోరుకుంటున్నామని అయన తెలిపారు. ఆయనతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న గమలేయా డైరెక్టర్ అలగ్జాండర్ జింట్ బర్గ్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తమ సంస్థ 20 వేల మందిపై వ్యాక్సిన్ ను ప్రయోగించిందని, వారిలో ఎవరికీ సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని అంతేకాకుండా వారి శరీరాల్లో యాంటీ బాడీలు పెరిగాయని, ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని అన్నారు.