కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

 

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. మహబూబ్ నగర్ జిల్లా తన నియోజక వర్గం కొడంగల్ లో ఉన్న తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యారని.. కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు డైరెక్షన్ చేస్తుంటే కేసీఆర్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కేవీపీని రోజూ కలుస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అని తిట్టే కేసీఆర్ కు కేవీపీ మాత్రం ఆంధ్రా కాదా.. ఆంధ్రాకు చెందిన కేవీపీతో కేసీఆర్ కు ఉన్న దోస్తీ ఏంటని అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు కేవీపీని కలవడం నిజం కాదని అంటే తాను ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

 

పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతూ కేసీఆర్ కనుక ఈ పాలమూరు ప్రాజెక్టును 2019 లో జరగబోయే ఎన్నికల నాటికి పూర్తి చేసినట్టయితే పాలమూరులో టీడీపీ పోటీచేయదని.. ఒకవేళ పూర్తిచేయలేకపోతే మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు టీడీపీ జెండా మోయడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. బంద్ ల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజలను రెచ్చగొడుతుందని.. బంద్ ల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడానికి వచ్చే అధికార పార్టీ కార్యకర్తలను ఊరుకోవద్దని వారిని చెట్లకు కట్టి వేయాలని అన్నారు.

Teluguone gnews banner