Read more!

ఏపీలో మరోసారి కరోనా రెడ్ జోన్.. ఎక్కడంటే..

గత కొంత కాలంగా ఏపీలో తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి దీంతో ఏపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని మళ్లీ రెడ్ జోన్‌గా ప్రకటించింది. మరోపక్క దేశంలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశంపై మళ్లీ దృష్టి పెట్టింది గతంలో కరోనా కట్టడి కోసం జోన్లుగా ప్రకటించి చర్యలు తీసుకున్నట్టుగానే మళ్లీ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రదేశాలలో మళ్లీ రెడ్ జోన్ విధించారు. చిత్తూరు నగరంలోని కేశవరెడ్డి పాఠశాల, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ వైరస్ నియంత్రణ చర్యలను చేపట్టారు ఈ రెండు విద్యా సంస్థల్లోనూ సోడియం హైఫోక్లోరైట్ స్ప్రే చేయించారు. అంతేగాకుండా వారం రోజుల పాటు ఆ పాఠశాలలను మూసి వేయాల్సిందిగా అదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన విద్యార్థుల తరగతి గదిలోని మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను సేకరించి, వారికి పరీక్షలు నిర్వహించే చర్యలు చేపట్టారు. ఈ పాఠశాల, కళాశాల పరిసరాలలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.