సీఎం జగన్ కు డిక్లరేషన్ తలనొప్పి.. ఎక్కడికక్కడ టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
posted on Sep 23, 2020 @ 10:58AM
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేసథ్యంలో సీఎం జగన్ ఈరోజు తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబులను పోలీసులు అరెస్టు చేశారు. పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి, అనుషా రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరో పక్క బీజేపీ నాయకులు, హిందూ సంఘాల కార్యకర్తలు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేటప్పుడు వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తాము సీఎం జగన ను రాజీనామా చేయమని అడగడంలేదని.. బ్రిటిష్ కాలం నుండి వస్తున్న ఆచారాన్ని కాపాడమని కోరుతున్నామని అన్నారు. జగన్ జెరూసలేం యాత్రకు వెళ్లినప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా వెళతారని, అదే హిందూ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మాత్రం ఒక్కరే వస్తారని.. దీనికి కారణమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు సంతకం చేశారని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని మాత్రమే తాము కోరుతున్నామని, ఇదే సమయంలో హిందూమతంపై దాడిని ఆపాలని కోరుతున్నామని ఆ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.