లామినేట్ షీట్ తో కొత్తరకం మాస్క్! ధర 50 రూపాయలే!
posted on Apr 8, 2020 @ 12:15PM
ఓ పక్క కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మరో వైపు మాస్కుల కొరత వుంది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. పైగా మాస్కుల ధరలను ఒక్కసారి పెంచేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల, పరిశోధన సంస్థ. కొత్తరకం మాస్క్ ను తయారు చేసింది.
ఆసుపత్రికి చెందిన యువ ఇంజనీరింగ్ బృందం సందీప్ వెంపటి, కార్తీకేశ్, ఆశిష్తోపాటు నేత్ర వైద్యులు వినీత్ జోషి తదితరులు ఈ వైజర్ను కొత్తరకం మాస్క్ ను రూపొందించారు. కరోనా చికిత్సలు అందించే వైద్యులు, సిబ్బందికి ఈ మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన సందీప్ తెలిపారు.
లామినేషన్ కోసం ఉపయోగించే 150 మైక్రాన్ల ప్లాస్టిక్ షీట్ను తీసుకొని 3డీలో మాస్క్ నమూనాను రూపొందించారు. మాస్క్ను పెట్టుకునేందుకు అవసరమైన విడి భాగాల సాయంతో ఆసుపత్రిలోనే ఈ వైజర్ను తయారు చేశారు. దీనికి వెనుక రబ్బర్ బ్యాండ్తో మాస్క్ను అనుసంధానించడం వల్ల ప్రత్యేకంగా తాళ్లతో కట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
ఒకసారి ముఖానికి తగిలించుకుంటే మళ్లీ తీసేవరకు అలాగే ఉంటుంది. నుదురు నుంచి గడ్డం కిందవరకు ఈ మాస్క్ షీటు ఉంటుంది. దీంతో ఎలాంటి వైరస్ దాడి చేసే పరిస్థితి వుండదు.
నిరాటంకంగా 8 గంటలపాటు వాడుకొని... తర్వాత షీట్ను శానిటైజర్ లేదా సబ్బు నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్నిసార్లయినా దీనిని శుభ్రంచేసి వాడుకోవచ్చని సందీప్ చెప్పారు.
ఇప్పటివరకు 2 వేల వైజర్లను తయారు చేశారు. దీని ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయనున్నట్లు సందీప్ వెల్లడించారు.