ట్రంప్ ఫోన్ కాల్స్ ను రిజెక్ట్ చేసిన ప్రధాని మోడీ!?
posted on Aug 27, 2025 5:37AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ పేర ఇండియాపై 50శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు ఒకింత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంత కంటే ముందు ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానంటూ క్రెడిట్ కొట్టేయాలన్న ట్రంప్ ప్రయత్నాలను భారత్ బలంగా తిప్పికొట్టింది. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకుంటే టారిఫ్ లు తధ్యమంటూ చేసిన హెచ్చరికలను కూడా ఖాతరు చేయలేదు.
అమెరికా పెద్దన్న పెత్తనాన్ని ఇసుమంతైనా సహించే ప్రశక్తి లేదని ఇండియా మాటల్లో చేతల్లో విస్పష్టంగా తేల్చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు అంత సామరస్యపూరితంగా లేవు. అయితే.. భారత్ తో సంబంధాలను దెబ్బతీసుకుంటే.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న భావన అమెరికా వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో ట్రంప్ వైఖరిని అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నివేదిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. జర్మన్ కు చెందిన ఫ్రాంక్ ఫర్టర్ ఆల్జెమైన్ జైటంగ్ ప్రచురించిన వార్త ప్రకారం ఇటీవలి కాలంలో అంటే భారత్ పై సుంకాల ప్రకటన తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీకి పదేపదే ఫోన్ చేశారు. అయితే ఆ ఫోన్ కాల్స్ ను ప్రధాని రిసీవ్ చేసుకోలేదు. అసలు ట్రంప్ తో మాట్లాడేందుకు కూడా మోడీ విముఖంగా ఉన్నారు. ట్రంప్ కనీసం నాలుగు సార్లు మోడీకి ఫోన్ చేశారు. అయితే ప్రధాని మోడీ మాత్రం సంప్రదించలేదు. ఫ్రాంక్ ఫర్టర్ ఆల్జెమైన్ జైటంగ్ ప్రచురించి వ్యాసం మేరకు ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను చనిపోయిందంటూ చేసిన వ్యాఖ్య.. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కొనసాగింపునకు వ్యతిరేకంగా భారత్ పై సుంకాల విధింపు విషయంలో మోడీ ఆగ్రహంగా ఉన్నారు.
అందుకే ట్రంప్ టారిఫ్ లు అమలు అయ్యే బుధవారం (ఆగస్టు 27)కు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీతో సంప్రదించడానికి శతధా ప్రయత్నించినా మోడీ స్పందించలేదు. ట్రంప్ సుంకాల విధింపు అన్యాయమని విస్పష్టంగా తేల్చేసిన భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేయలేదు. అమెరికా ఆంక్షలకు, ఒత్తిడికి తలొగ్గేది లేదని విస్పష్టంగా చెప్పడమే కాకుండా, ట్రంప్ ఫోన్ కాల్స్ ను అటెండ్ చేయకపోవడం ద్వారా మోడీ అమెరికాకు గట్టి హెచ్చరిక లాంటి సందేశం ఇచ్చారని ఆ వార్తా పత్రిక పేర్కొంది.