ప్రశాంత్ కిషోర్ పవర్ ఫుల్ పంచ్.. జగన్ కు దిమ్మతిరిగిందా?

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో  చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల  వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. 

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తయిన తరువాత మూడు రోజులకు తీరిగ్గా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్.. అక్కడ తమ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలౌతుందంటూ ఆయన ఓ ఇంటర్వ్యేూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సారి తాము మరింత ఘన విజయం సాధించి అధికారం చేపడతామన్న ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రశాంత్ కిషోర్ లెక్కలన్నీ తప్పులని కొట్టి పారేశారు. ఆయన ఏపీ ఫలితాలు చూసి కంగుతింటారన్నట్లుగా మాట్లాడారు. 

ఆ జగన్ వ్యాఖ్యలకే ప్రశాంత్ కిషోర్ గట్టి రిటార్ట్ ఇచ్చారు. ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులు ఓటమి గురించి ఎన్నడూ ప్రస్తావించరనీ, కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తారనీ అంటూ  ఇప్పడు జగన్ కూడా అదే చేస్తున్నారని చెప్పారు. అయినా మరో పక్షం రోజులలో కౌంటింగ్ జరుగుతుందనీ, ఒక వేళ తన అంచనాలు నిజమైతే  బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో  అమిత్ షా  గెలుపు ధీమా వ్యక్తం చేసి ఎలా ఓడిపోయి తలదించుకున్నారో అలాగే జగన్ రెడ్డి కూడా తలదించుకుంటారని ప్రశాంత్ కిషోర్ చురకలు వేశారు. ఒక వేళ తన అంచనా తప్పైతే తాను తలదించుకోవలసి వస్తుందని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా తన అంచనాలపై ప్రజలలో ఉన్న నమ్మకం, తన ఇమేజ్ దృష్ట్యా  ఇలాంటి అంచనాల విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానన్న ప్రశాంత్ కిషోర్  ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది పక్కన పెడితే జగన్ పార్టీ ఓడిపోబోతోంది. ఇది నిజం అని కుండబద్దలు కొట్టారు.    

Teluguone gnews banner