చంద్రబాబే మళ్లీ సిఎం : కాంగ్రెస్ నేత చింతామోహన్ 

 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్, దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని... అయితే, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ కచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోబోతోందని చింతా మోహన్ తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్ కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 150కి మించి సీట్లు రావని తెలిపారు.

Teluguone gnews banner