ప్రధాని మోడీకి గడ్డు కాలం.. దారుణంగా పడిపోయిన గ్రాఫ్
posted on May 19, 2021 @ 6:49PM
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోడీ. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీలో ఆయనే టాప్. సోషల్ మీడియాలోనే మోడీనే కింగ్. ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నది నరేంద్ర మోడీకే. కాని ఇదంతా ఇప్పుడు ఘనం. ప్రస్తుతం సీన్ మారిపోయింది. రెండోసారి సూపర్ మెజార్టీ విజయం సాధించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పాపులారిటీ వేగంగా పతనమవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఆయన క్రేజ్ దారుణంగా పడిపోయింది. ఇంకా పోతూనే ఉంది. ఇంకొన్ని రోజుల్లో మరింతగా దిగజారే పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
దేశంపై విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ ప్రధాని మోడీ పేరుప్రతిష్ఠలను దారుణంగా దిగజార్చింది. అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్స్ చేసిన సర్వేలో మోదీ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి పడిపోయినట్టు తేలింది. మార్నింగ్స్ కన్సల్ట్స్ అనేది ప్రపంచస్థాయి నేతల పాప్యులారిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ నివేదికలు ఇస్తుంటుంది. తాజాగా అది వెల్లడించిన నివేదికలో ఈ వారం మోడీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ఆగస్టు 2019లో తాము మోడీ పాప్యులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు వచ్చిన అత్యంత కనిష్ఠ రేటింగ్ ఇదేనని ఆ సంస్థ తెలిపింది.
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడం నరేంద్ర మోడీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడడానికి మోడీయే కారణమంటూ ఇటీవల గ్లోబల్ మీడియా కూడా దుమ్మెత్తి పోసింది. దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ లేక కొవిడ్ రోగులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుండడం, ఆసుపత్రుల్లో బెడ్ల కోసం వేసి చూసి పార్కింగ్ ప్రదేశాల్లోనే చనిపోతుండడం, శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు క్యూలు.. వంటివన్నీ సోషల్ మీడియాలో మోడీపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. దీంతో గత మూడు దశాబ్దాల్లో ఏ భారత నాయకుడికి సాధ్యం కాని ఇమేజ్ను సొంతం చేసుకున్న మోడీ.. ప్రతిష్ఠ కరోనా దెబ్బకు అమాంతం మసకబారింది.