రైతుల ఖాతాల్లోకి నగదు.. కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్
posted on May 13, 2021 @ 2:22PM
రైతులకు ప్రధానమంత్రి కార్యాలయం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం క్రింద రైతులకు ఎనిమిదో విడత ఆర్థిక సహాయాన్ని చేస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. సుమారు 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.19 వేల కోట్లకు పైగా అందజేస్తారు. ఈ వివరాలను గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
పీఎం కిసాన్ పథకం క్రింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున శుక్రవారం విడుదల చేస్తారు. ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ సందర్భంగా మోడీ శుక్రవారం ఉదయం 11 గంటలకు రైతులతో మాట్లాడతారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.
పీఎం కిసాన్ పథకం క్రింద చిన్నకారు, సన్నకారు రైతులు లబ్ధి పొందవచ్చు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ సొమ్మును రూ.2,000 చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. మొదటి విడత సహాయాన్ని ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో, రెండో విడత సహాయాన్ని ఆగస్టు 1 నుంచి నవంబరు 30 మధ్య కాలంలో, మూడో విడత సహాయాన్ని డిసెంబరు 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ఇస్తారు.