జగన్ మొహం చాటేసి.. మిథున్ రెడ్డి పరామర్శకు పేర్నిని పంపారా?
posted on Sep 3, 2025 @ 2:18PM
మద్యం కుంభకోణం వైసీపీ పునాదులనే కదిపేలా ఉండటంతో ఆ పార్టీలో కంగారు మొదలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టై జైలు పాలైన తమ పార్టీ నేతలను కలవడానికి కూడా వైసీపీ అధినేత జగన్ ముందువెనుకలాడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారిని కూడా ఆయన ఇంత వరకూ జైలుకు వెళ్లి పరామర్శించింది లేదు. ఈ విషయంలో ఇప్పటికే చెవిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఒకింత అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో.. ప్రస్తుతం జగన్ వాయిస్ గా మారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిశారు.
మద్యం కుంభకోణంలో అరెస్టైన మిథున్ రెడ్డి దాదాపు గత నెలన్నరగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని యథా ప్రకారంగా ఆవు కథలా గతంలో చెప్పిన మాటలనే మళ్లీ వల్లెవేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 40 రోజులు గడుస్తున్నా, ఇంతవరకు ఒక్కరోజు కూడా ఎందుకు కస్టడీకి తీసుకోలేదంటూ నిలదీశారు.
కేవలం కక్ష సాధింపు, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినిక మానసికంగా కుంగదీయాలన్న దురుద్దేశంతోనే అక్రమంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికించి జైల్లో పెట్టారని పేర్ని నాని అన్నారు. మద్యం కుంభకోణంలో నిందితులు చెప్పిన మాటల ఆధారంగా ఒక ఎంపీని అరెస్టు చేయడం అన్నది నిస్సందేహంగా రాజకీయ కక్ష సాధింపే అన్నారు. అక్కడితో ఆగకుండా ఓ వారం పది రోజుల్లో మిథున్ రెడ్డి బయటకు వస్తారని జోస్యం చెప్పారు. బయటకు వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారన్న హెచ్చరిక కూడా చేశారు. మొత్తం మీద జగన్ మిథున్ రెడ్డికి ముహం చాటేసినా.. ఆయన తరఫున పేర్ని నాని వచ్చి కవర్ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.