"మీ పేరు రాసి చచ్చిపోతాం".. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహం..
posted on Oct 15, 2020 @ 6:17PM
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. దీంతో ఒక పక్క నాలాలు మరోపక్క చెరువులు పొంగి కాలనీలు మునిగిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజల పరిస్థితి దారుణంగా తయారయింది. దీంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను జనం కడిగిపారేస్తున్నారు. తాజాగా వరదలో చిక్కుకున్న వారిని పరామర్శించేందుకు వచ్చిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సుభాష్ రెడ్డిని చూసిన బాధితులు అయన మీద మండి పడ్డారు. సుభాష్ రెడ్డితో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. ‘‘మీ పేరు రాసి చచ్చిపోతాం’’ అంటూ ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న తమని అసలు ఎవరు ఆదుకోవడం లేదని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామంలో చెరువు నిండటంతో పూజలు చేసేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనంపై ఏకంగా చెప్పులు, రాళ్లు విసిరారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి తమ గ్రామంలోకి రావొద్దంటూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారికీ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్థానికులపై లాఠీ చార్జ్ చేసారు. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.