రచ్చగెలిచి ఇంట గెలవని పెదరాయుడు
posted on Dec 10, 2024 @ 1:23PM
గత రెండు మూడు రోజులుగా మంచు ఫ్యామిలో ఆస్తి తగదాలు రచ్చకెక్కాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో, సమాజంలో పెదరాయుడిగా చెలామణి అవుతున్న మోహన్ బాబు పరువు అమాంతం పడిపోయింది. అప్పట్లో తనకు వ్యతిరేకంగా వార్త ప్రసారం చేసిన ప్రముఖ టీవీ చానల్ లోకి గూండాలతో జొరబడ్డ మోహన్ బాబు తన సర్వీస్ రివాల్వర్ తో సిబ్బందిని భయపెట్టిన సంగతి తెలిసిందే. తనకు ప్రాణ హాని ఉందని మోహన్ బాబు తాజాగా పోలీసులకు ఫిర్యా చేస్తే కొడుకు మనోజ్ కూడా తండ్రి మోహన్ బాబుపై , సోదరుడు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం మోహన్బాబు, మనోజ్ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. దీన్ని మోహన్బాబు , మంచు మనోజ్ ఖండించినప్పటికీ సోమవారం మరో మారు ఘర్షణ జరగడంతో మనోజ్ ఇల్లు వదిలేసి పారిపోయారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన విష్ణు తమ్ముడిని మెడలు పట్టి గెంటేసినట్లు తెలుస్తోంది. . అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్కు మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచుటౌన్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న చిన్నకుమారుడు మనోజ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయి ఆస్తికోసం నాలుగు నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మనోజ్ తను కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి ఏడు నెలల శిశువుని పనిమనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని మోహన్బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటికి వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా తండ్రి మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేయడం చూస్తే మోహన్ బాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. మోహన్ బాబు చచ్చిన పాము అని పలువురు చర్చించుకుంటున్నారు. షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిన కారణంగా యాక్ట్రెస్ సాక్షి శివానంద్ చెల్లెలి చెంప చెల్లు మనిపించిన మోహన్ బాబు తనకు చిన్నకొడుకు మనోజ్ నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులనాశ్రయించాడు. నా ఇంటి నుంచి నన్నే శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు . మొదటి భార్య సంతానం మంచు విష్ణు, మంచు లక్ష్మి రెండో భార్య కుమారుడు మంచు మనోజ్. కానీ ఇన్నాళ్లు ఒకే తల్లి పిల్లలు అని అందరూ అనుకున్నారు. ఈ గొడవలతో మోహన్ బాబు కుటుంబం పూర్తిగా బజారున పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం మంచు విష్ణు మంచుమనోజ్ ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయి. అయితే అప్పట్లో వీరి గొడవ వీడియోల ద్వారా బయటకు వచ్చాయి. మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. ఈ గొడవ పూర్తిగా సద్దుమణిగినట్లు అందరూ భావించారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న గొడవతో క్రమ శిక్షణకు మారు పేరుగా నిల్చిన మోహన్ బాబు ఇంట్లో నే క్రమ శిక్షణా రాహిత్యం బయటపడ్డట్టయ్యింది.
మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థల ఆదాయం పూర్తిగా మంచు విష్ణు అనుభవిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మోహన్ బాబుకు చెందిన లక్మి ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రాలు ఎక్కువగా మంచు విష్ణు వే ఉండటం మంచు మనోజ్ కు నచ్చడం లేదు.
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నాలుగు నెలలకు మంచు మనోజ్ తండ్రి ఇంటికి వచ్చాడు. అన్న విష్ణు దుబాయ్ లో ఉన్న సమయంలో మనోజ్ రావడం తండ్రితో గొడవ పడటంతో మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుడిని చుట్టుముట్టారని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నానన్నారు. కర్రలతో వచ్చిన 10 మంది జల్పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించారన్నారు. వాస్తవానికి చిత్రీకరణ కోసం వెళ్తాననే సమాచారంతో ఇంట్లోకి వచ్చి భార్య, పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారన్నారు.
మంచు మనోజ్ భార్య మౌనిక మోహన్ బాబు ఇంట్లో ఉన్న సమయంలో గొడవలు జరిగాయి. సీసీటీవీలో ఇవన్నీ రికార్డయ్యాయి. కానీ ఈ ఫుటేజి మాయమయ్యాయి. నిజంగానే మంచు మనోజ్ కు అన్యాయం జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఎపి హోంమంత్రి అనితలకు మనోజ్ ట్వీట్ చేయడం చూస్తే ఈ వివాదం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు.