అమరావతికి బీజేపీ పెద్దలు ఒప్పుకున్నారు! పవన్ కల్యాణ్ సంచలనం..
posted on Dec 12, 2021 @ 5:57PM
ఆంధ్రప్రదేశ్ కు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 7 వందలకు రోజులకు పైగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం టు దేవ స్థానం పేరుతో మహా పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం యాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది. ఈనెల 17న ముగింపు సభ నిర్వహించబోతున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు అడగడుగనా ఘన స్వాగతం లభించింది. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఏపీ రాజధాని, అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, స్టీల్ ప్లాంట్ కార్మికులకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు మద్దతు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు జనసేన గుర్తొస్తుందని, రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలంటూ ఛలోక్తి విసిరారు. వైసీపీకి చెందిన వ్యక్తులు జనసేనకు శత్రువులు కాదని, వారి విధానాలు బాగాలేనప్పుడు మాత్రమే తాము ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తాము ఎప్పుడూ వైసీపీ విధానాలనే ఎత్తిచూపుతాం తప్ప, వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయబోమని వివరించారు. కానీ వైసీపీ నేతలు అలా కాదని, స్టీల్ ప్లాంట్ అంశం ఏమైందని అడిగితే తమను పచ్చిబూతులు తిడతారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంట్లోవాళ్లను కూడా తిడతారని తెలిపారు.
ఓ ప్రాంతంలో పరిశ్రమ వచ్చిందంటే ఆ ప్రాంత అభివృద్ధికి అది సంకేతం అని పవన్ చెప్పారు. విశాఖ ఉక్కు కేవలం ఓ చిన్న పరిశ్రమ కాదు, ఇది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవమని అన్నారు. ఎందరో త్యాగాల వలన వచ్చిందన్నారు. ఇవాళ ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయడమే అన్నారు పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో నేను మోదీతోనూ, బీజేపీతోనూ గొడవపెట్టుకోవాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే తాను ఎప్పుడు వెళ్లినా బీజేపీ అగ్రనేతలు ఎంతో గౌరవం ఇస్తారని చెప్పారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సమయంలో మేం వారితో ప్రస్తావించిన మొదటి అంశం ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలన్నదే అని చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం సమ్మతించబట్టే తాము ముందుకు వెళ్లామన్నారు. దీనిపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు జనసేన చీఫ్. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అమరావతే రాజధాని అని తిరుపతిలో చెప్పారని తెలిపారు.
ఎవరికైనా మాట మీద నిలబడడం చాలా ముఖ్యమన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ వాళ్లు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు.. విపక్షంలో ఉన్నప్పుడు వారు ఏమన్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీ ఢిల్లీకి వెళితే కేంద్రం పెద్దలు ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు.. మరి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్న వైసీపీ ఏంచేస్తోంది? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు... మనం అడగకుండా ఉండడంలోనే తప్పుందని పవన్ ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ మినీ రత్న కంపెనీని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది..అప్పుడు మేం టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. అనంతరం దాని ప్రైవేటీకరణ ఆగింది అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ప్రభుత్వం పోరాడకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుంది? మనం ఎన్నికలప్పుడు విడివిడిగా పోటీ పడదాం... కానీ స్టీల్ ప్లాంట్ అంశంలో కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.