మోదీ ప్రసంగం తర్వాత పాక్ డ్రోన్ దాడులు.. డీజీఎంవోల చర్చల్లో తప్పు జరిగిందంటూ క్షమాపణలు
posted on May 13, 2025 @ 9:40AM
కుక్కతోక వంకర, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు.. పాకిస్థాన్ తీరును, వైఖరిని చెప్పడానికి ఇలాంటి ఎన్నో సామెతలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. ఉగ్రవాదులను భారత్ లో హింసాత్మక దాడులకు ప్రోత్సహిస్తూ అదే తన బలం అనుకుంటున్న పాకిస్థాన్ కు భారత్ ఆపరేషన్ సిందూర్ తో గట్టిగా బుద్ధి చెప్పింది. కాదు కాదు బుద్ధి చెప్పానని భావించింది.
భారత్ దాడులకు బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా సోమవారం (మే 12) జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. అంతే కాదు.. పాకిస్థాన్ విషయంలో ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలు వినా మరే విషయంలోనూ చర్చలకు తావు లేదని కుండబద్దలు కొట్టేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే, భారత్ పై దాడులకు ఉగ్రవాదులను ప్రోత్సహించడం, ప్రేరేపించడం మానుకోకుంటే.. ఆ దేశాన్ని అంతం చేస్తామన్న విస్పష్ట హెచ్చరిక సైతం చేశారు. అయినా పాక్ బుద్ధి మారలేదు. తీరు మారలేదు. అటు జాతి నుద్దేశించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ఇలా ముగిసిందో లేదో.. అటు పాక్ భారత భూభాగంపైకి డ్రోన్ దాడులకు తెగబడింది.
సోమవారం (మే 12) రాత్రి జమ్మూ సెక్టార్ లోని సాంబాలో పాక్ పలు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే పంజాబ్ లోని జలంధర్ పైనా డ్రోన్ దాడులకు తెగించింది. వీటన్నిటినీ భారత్ నేలమట్టం చేసింది. ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లలో సోమవారం రాత్రి మళ్లీ బ్లాక్ అవుట్ ప్రకటించారు. పాక్ నుంచి డ్రోన్ దాడులు నిలిచిపోవడంతో అర్ధరాత్రి దాటిన తరువాత బ్లాక్ అవుట్ ఎత్తివేశారు.
ఇలా ఉండగా పాకిస్థాన్, భారత్ మధ్య కాల్పులు ఉండరాదనీ ఇరు దేశాల డీజీఎంవోల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చలు సోమవారం (మే12) సాయంత్రం ఆరంభమై రాత్రికి ముగిశాయి. కాల్పుల విరమణ కొనసాగేలా చర్యలు చేపట్టాలని, దూకుడు, శత్రుత్వం పెరిగేలా దుందుడుకు చర్యలు ఉండరాదని ఈ చర్చల్లో ఒక నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని ఇండియన్ ఆర్మీ తన అఫీషియల్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇకపై ఉల్లంఘించబోమని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయబోమని పేర్కొంది. ఇక నుంచీ పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ ఉండవని పాకిస్థాన్ డీజీఎంవో పేర్కొన్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.
మొత్తం మీద ఆపరేషన్ సిందూర్ అనంతరం కుదిరిన కాల్పుల విరమణను తాము ఉల్లంఘించినట్లు పాక్ ఆర్మీ అంగీకరించడమే కాకుండా, ఆ తప్పు మరోసారి జరగదని పేర్కొంది. ఇక చర్చల సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ పూర్తిగా డిఫెన్స్ మోడ్ లో ఉందనీ, భారత్ షరతులకు పూర్తిగా అంగీకరించిందనీ, గతంలో తప్పులు పునరావృతం కావనీ కాల్పుల విరమణ కొనసాగిద్దామనీ ప్రాధేయపడిందనీ భారత ఆర్మీవర్గాలు తెలిపాయి.