బిగ్ షాక్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్..
posted on Sep 9, 2020 @ 9:38AM
కరోనా వైరస్ తో విలవిలలాడుతున్న ప్రపంచానికి పెద్ద ఆశా కిరణంగా కనిపించిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్లో తేడా రావడంతో... తాజాగా ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ని తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు తెలిసింది. ప్రపంచంలోనే కరోనాకి బెస్ట్ వ్యాక్సిన్ అని దేశదేశాలు నమ్ముతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రాజెనెకా ఫార్మా కంపెనీలు సిద్ధం చేసిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ని ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా కంపెనీ ప్రకటించింది. దీనికి గల ప్రధాన కారణం... బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొన్న ఒక వాలంటీర్ కు వ్యాక్సిన్ రియాక్షన్ ఇచ్చింది. అయితే ఆ వ్యక్తికీ "తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని దీంతో వ్యాక్సిన్ ఇచ్చి దానిపై సమీక్షించే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది" అని తాజాగా తన స్టేట్మెంట్లో ఆస్త్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. దీంతో ఎందుకైనా మంచిదని ట్రయల్స్ తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా ప్రకటించింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందో అప్పుడే చెప్పలేమన్న ఫార్మా కంపెనీ ఆ వ్యక్తి త్వరలో కోలుకుంటారని భావిస్తున్నట్లు చెప్పింది.
అయితే ఈ ట్రయల్స్ నిలిపివేత అన్నది వ్యాక్సిన్ ప్రయోగాలలో సహజంగా జరిగే ప్రక్రియేనని, ట్రయల్స్లో కనుక ఎవరికైనా తేడా వస్తే ఇలాగే చేస్తారని.. దీనిపై దర్యాప్తు జరపడం ద్వారా ట్రయల్స్పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే నిలిపివేసినట్లుగా తెలిపింది. అయితే వ్యాక్సిన్ తయారీ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకుగాను ఇలా ఎందుకు జరిగిందో త్వరగా తెలుసుకుని మళ్ళీ ప్రయత్నిస్తాం" అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఇదే సమయంలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం ఏమి చిన్న విషయం కాదంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రభావం... ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయ్యేందుకు కారణం కాగలదని వారు అంటున్నారు. అంతేకాకుండా మిగిలిన వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు కూడా ఇటువంటి విషయాల్ని సీరియస్గా తీసుకోవాలని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రష్యా తన వ్యాక్సిన్ మొదటి రెండు దశల ట్రయల్స్ పూర్తవగానే వ్యాక్సిన్ తయారైపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తి వైపు అడుగులు కూడా వేస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వ్యాక్సిన్ ఏదైనా మూడు దశల్లోనూ మంచిదని తేలితేనే దాన్ని ప్రజలకు అందివ్వాలంటోంది. దీనికి గల ముఖ్య కారణం మూడో దశ ట్రయల్స్ లో ఎక్కువ మందిపై పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకపోతె అపుడు వ్యాక్సిన్ సరైనదని చెప్పేందుకు వీలవుతుందని అంటోంది. తాజాగా ఆక్స్ఫర్డ్-ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ కూడా ఈ కారణంగానే... మూడు దశలూ సంపూర్ణంగా పూర్తి చేశాకే... వ్యాక్సిన్ రిలీజ్ చెయ్యాలని నిశ్చయించుకుంది.
ప్రపంచంలో ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ని అమెరికాలో ఆగస్టులో ప్రారంభించింది. దీంట్లో 30వేల మంది పాల్గొంటున్నారు. అంతకుముందు రెండు, మూడో దశ ట్రయల్స్ని బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలో చేపట్టారు. అయితే మొదటి, రెండో దశల్లో... కొంత మందికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి చిన్నచిన్న సమస్యలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఓ వ్యక్తికి కాస్త తీవ్ర సమస్యలు రావడంతో ట్రయల్స్ నిలిపివేసింది.