8 కేసులతో తెలంగాణలో ఒమిక్రాన్ హడల్.. హన్మకొండ మహిళకు పాజిటివ్..
posted on Dec 17, 2021 @ 12:23PM
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. అధికారుల దృష్టికే 8 కేసులు వచ్చాయి. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9 మందికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. వారిలో 8 మంది రాష్ట్రంలో ప్రవేశించారని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మరొక వ్యక్తి పశ్చిమ్ బెంగాల్కు వెళ్లిపోయారని చెప్పారు.
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురితో పాటు హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ సోకినట్టు వెల్లడించారు. ఆ మహిళకు మొదట్లో నెగటివ్ వచ్చిందని.. అయితే, 8 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే.. కొవిడ్ పాజిటివ్.. ఆపై ఒమిక్రాన్ నిర్ధరణ అయిందని డీహెచ్ తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో సామాజిక వ్యాప్తి జరగలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ పట్ల అనవసర భయాందోళనలు అవసరం లేదు. 95% కంటే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. ఈ వేరియంట్తో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మూడో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశముంది.. అని డీహెచ్ అన్నారు.
వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి. ఇంటా బయటా మాస్కులు ధరించాలి. కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలి.. అని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు.